ఆర్టీసీ విలీనంపై కేసీఆర్ వ్యాఖ్యలతో జగన్ దూకుడు పెంచారా: అసాధ్యం అన్న మాట సుసాధ్యం చేస్తారా !!
టిఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం సాధ్యం కాదు అని చెప్పిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ విలీనం గురించి మాట్లాడడం ఏపీ ప్రభుత్వానికి సూటిగానే తగిలినట్లైంది. అందుకే ఏపీఎస్ఆర్టీసీ గురించి సీఎం కేసీఆర్ మాట్లాడిన గంటల వ్యవధిలోనే ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ విలీన ప్రక్రియ పూర్తి చేసేందుకు వర్కింగ్ గ్రూప్ ను నియమించింది. ఇక సీఎం కేసీఆర్ మాటలు, ఏపీ సీఎం జగన్ వేస్తున్న అడుగులు చూస్తుంటే సీఎం కేసీఆర్ అసాధ్యం అన్న దాన్ని ఏపీలో సుసాధ్యం చేసి చూపించాలనే పట్టుదలతో ఉన్నట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏపీ ఆర్టీసీ విలీనంపై కేసీఆర్ వ్యాఖ్యలు
ఆర్టీసీ విలీనంపై మాట్లాడిన సీఎం కేసీఆర్ ఏపీలో ఆర్టీసీ విలీనం గురించి వ్యంగ్యంగా మాట్లాడారు. ఒక ఎక్స్ పర్మెంట్ చేశారు వాళ్లు. అక్కడ ఏం మన్నూ కూడా జరగలేదు. మీకు తెల్వదు. కమిటీ వేశారు. ఇంకా, మూడు నెలలకో, ఆరు నెలలకో ఏదో చెబుతారట కథ అంటూ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు విలేకరులు అడిగిన ప్రశ్నకు కేసీఆర్ బదులిస్తూ, నీకు అర్థమవడం లేదు సీఎం జగన్ సంగతే నేను చెబుతున్నా, మైకులోనే చెబుతున్నా, దాచుకోవడం ఎందుకు? అంటూ తనదైన భాషలో మాట్లాడారు.
కేసీఆర్ వ్యాఖ్యలకు సమాధానం చెప్పే పనిలో ఏపీ సర్కార్
ఏం చేసిండ్రు? ఆర్డర్ తీసిండ్రు, కమిటీ వేసిండ్రు.. ఏమవుతుందో ఏమో దేవుడికే ఎరుక! ఎస్.. ఐయామ్ టెల్లింగ్ ద ఫ్యాక్ట్' అని తనదైన బాణీలో చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ విలీనంకు ఓ ఆర్డర్ ఇచ్చి.. కమిటీ మాత్రమే వేశారని అక్కడ ఏం జరుగుతుందనేది ఓ ఆర్నెల్ల తర్వాత ముచ్చట అని సీఎం కేసీఆర్ సూటిగానే ఏపీ ప్రభుత్వానికి తగిలేలా వ్యాఖ్యానించారు. ఇక్కడ కేసీఆర్ వ్యాఖ్యలు చేశారో లేదో కొన్ని గంటల్లోనే ఆర్టీసీ విలీన ప్రక్రియ పూర్తి చేసేందుకు వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేశారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి .
ఏడుగురు సభ్యులతో వర్కింగ్ గ్రూప్ నియామకం
ఏడుగురు సభ్యులతో వర్కింగ్ గ్రూప్ను నియమిస్తూ జీవో జారీ చేశారు. ఆర్థిక,సాధారణ పరిపాలన,రవాణా, న్యాయ శాఖల అధికారులతో గ్రూప్ నియమించారు. ప్రజా రవాణాశాఖ ఏర్పాటు, పోస్టులు, డిజిగ్నేషన్ ల విషయంలో వర్కింగ్ గ్రూప్ ని ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. జీతాల చెల్లింపు, పే స్కేల్ విధి విధానాలు కూడా వర్కింగ్ గ్రూప్ ఖరారు చేస్తారు. వచ్చే నెల 15లోగా ఈ వర్కింగ్ గ్రూప్ నివేదిక ఇవ్వాలనిప్రభుత్వం ఆదేశించింది.
నివేదిక ఆధారంగా విలీనం పూర్తి చెయ్యాలని నిర్ణయం
ఎంత త్వరగా వర్కింగ్ గ్రూప్ నివేదిక అందిస్తే విలీనాన్ని అంత త్వరగా వచ్చేనెలలో పూర్తిచేసి జనవరి నుంచి ప్రభుత్వం తరఫున ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్న పట్టుదలతో ఏపీ సర్కార్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న ఆర్టీసీ విలీనాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ అలా తీసి పారేయడం ఏపీ ప్రభుత్వానికి ఏమాత్రం నచ్చినట్లుగా లేదు. అందుకే నోటి మాటలతో కాకుండా,చేతలతో సమాధానం చెప్పాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
ప్రజారవాణా విభాగంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం ప్లాన్
ఆర్టీసీని సాంకేతికంగా ప్రభుత్వంలో విలీనం చేయడం అసాధ్యం కాబట్టి ఉద్యోగులను విలీనం చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఏపీలో ప్రత్యేకంగా ప్రజారవాణా విభాగం ఏర్పాటు చేసి అందులో ఆర్టీసీ ఉద్యోగుల్ని విలీనం చేయనున్నారు. ఇక ఆర్టీసీ సంస్థ అలాగే ఉంటుంది. ఆర్టీసీ ఉద్యోగులు సైతం ఆర్టీసీకే పని చేస్తారు. కానీ జీతాలు మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల్లాగా ప్రభుత్వం నుండి తీసుకుంటారు.
కేసీఆర్ అసాధ్యం అన్న దాన్ని జగన్ సుసాధ్యం చేస్తారా?
ఈ ప్రక్రియ చాలా రిస్క్ తో కూడుకున్న ప్రక్రియ, ప్రభుత్వ ఖజానాకు భారం. అయినప్పటికీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దీనిని ఖచ్చితంగా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే ఆర్టీసీకి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నారు. విలీన ప్రక్రియకు వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు. కెసిఆర్ సాధ్యం కాదు అని చెప్పింది, జగన్ సాధ్యం చేసే పనిలో ఉన్నారు. కానీ జగన్ ఏ మేరకు ఈ ప్రయత్నంలో సక్సెస్ అవుతారో వేచి చూడాలి .