నిన్న కాపు నేస్తం .. నేడు జగనన్న చేదోడు .. వారికి ఏడాదికి రూ. 10వేల ఆర్ధిక సాయం
ఏపీ ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాల విషయంలో దూకుడు చూపిస్తుంది. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చెయ్యాలి, ఆర్ధిక భరోసా అందించాలి అన్న ఉద్దేశంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమానికే పెద్ద పీట వేస్తున్నారు . నిన్న కాపు నేస్తం పథకం ద్వారా కాపు మహిళలకు ఐదేళ్ళ పాటు సంవత్సరానికి 15 వేల రూపాయలు ఆర్ధిక సాయం అందించనున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం తాజాగా నేడు జగనన్న చేదోడు పేరుతో మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది .
టైలర్లకు, రజకులకు, నాయీ బ్రహ్మణులకు ఆర్ధిక సాయం అందించే స్కీమ్
సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సమాజంలోని పలు వెనకబడిన వర్గాలకు ఆర్థిక సాయం ప్రకటిస్తూ వస్తున్న సీఎం జగన్ ఆటో, టాక్సీ వాలాలకు రూ. 10 వేల చొప్పున సాయం చేశారు. తాజాగా ఆయన మరికొన్ని బడుగు వర్గాలకు ఆర్థిక సాయం ప్రకటించినట్టు తెలుస్తుంది . టైలర్లకు, రజకులకు, నాయీ బ్రహ్మణులకు ప్రభుత్వం నుంచి ప్రతి ఏటా రూ. 10వేల సాయం చేయడానికి సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
జగనన్న చేదోడు పేరుతో ప్రతి ఏటా రూ. 10వేల సాయం
‘జగనన్న చేదోడు' అనే పేరుతో ఈ బృహత్తర పథకం కొనసాగనుంది . త్వరలోనే ఈ పథకం సీఎం జగన్ చేతుల మీదగా ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు . ఈ మేరకు ఇప్పటికే సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే అమ్మ ఒడి, వైఎస్సార్ రైతు భరోసా వంటి ఎన్నో మహత్తర పథకాలను అందిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఇటీవల కాపులకు కూడా ఆర్ధిక సాయాన్ని అందించే కాపు నేస్తం పథకం అందించనుంది. ఇప్పుడు వివిధ కులవృత్తులు నిర్వహించే వారికి సైతం ప్రతి ఏటా రూ. 10వేల సాయం చెయ్యనుంది .
5 ఏళ్ళ పాటు ఇవ్వనున్న ఆర్దిక సాయం
ఇక ఈ పథకం కూడా ఐదేళ్ళ పాటు కొనసాగనుందని తెలుస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతీ ఏడాది రూ. 10వేల చొప్పున ఐదేళ్లపాటు వారికి ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . మొత్తానికి ఈ ఐదేళ్ళ కాలంలో అన్ని వర్గాలకు వివిధ పథకాలతో వరాలు ఇవ్వనున్నారు సీఎం జగన్ . ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్ ఎన్నికల్లో వైసీపీకి ఉపకరిస్తాయని ఇప్పటి నుండే అడుగులు వేస్తున్నారు.