యూపిఏ ఇంటికే: జెపి, సీమాంధ్రలో మోడీ టూర్ ఖరారు
హైదరాబాద్: దేశంలో పెచ్చుమీరుతున్న రాజకీయ అవినీతిని అంతమొందించాల్సిన సమయం ఆసన్నమైందని, యూపిఏ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూపిఏ ప్రభుత్వం పదేళ్ల అధికారంలో అవినీతి, అక్రమాలు పెచ్చుమీరాయని, ఉపాధి లేక సతమతమవుతున్నారని ఆరోపించారు.
అవినీతికి పాల్పడినవారు ఎంతటివారైనా ప్రత్యేక కోర్టుల ద్వారా విచారించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని జయప్రకాశ్ నారాయణ అన్నారు. దీని కోసం దేశంలో వేగంగా విచారణ జరిపి తీర్పులు వెలువరించే కోర్టులు వచ్చినప్పుడే నేరస్థులకు శిక్షలు పడతాయని ఆయన అన్నారు.

దేశంలో రాజకీయ, ఆర్థిక విధానాలు మారాల్సిన అవసరం ఉందన్న జెపి, ప్రజలు యూపిఏకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ స్పష్టమైన ప్రణాళికతో ఉందని.. దేశానికి, యువతకు మేలు జరుగుతుందనే తాను బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి పూర్తి మద్దతు తెలిపినట్లు జయప్రకాశ్ నారాయణ స్పష్టం చేశారు.
సీమాంధ్రలో నరేంద్ర మోడీ షెడ్యూల్ ఖరారు
బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సీమాంధ్ర ప్రాంతంలో త్వరలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఏప్రిల్ 30న సాయంత్రం 6 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో మే 1న ఉదయం 9 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో, అనంతరం ఉదయం 11 గంటలకు నెల్లూరులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజున మధ్యాహ్నం 12 గంటలకు గంటూరులో, మధ్యాహ్నం 2.30గంటలకు భీమవరం, సాయంత్రం 5గంటలకు విశాఖపట్నంలో మోడీ పర్యటించనున్నారు.












Click it and Unblock the Notifications