ఏపీలో జాబ్ క్యాలెండర్ రగడ .. జనసేన నేతల గృహ నిర్బంధాలు, అణచివేతపై నాదెండ్ల ఫైర్ !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై పోరాటం ఉద్ధృత రూపం దాలుస్తోంది. నిన్నటికి నిన్న ఛలో తాడేపల్లి పేరుతో సీఎం జగన్ ఇంటి ముట్టడికి యువజన సంఘాల నాయకులు,విద్యార్థి సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఇక పోలీసులు ఎక్కడికక్కడ ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. నూతన జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగ యువత చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలిచిన టిడిపి నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు.ఇక నేడు జనసైన్యం రంగంలోకి దిగారు.
నిరుద్యోగుల కోసం రంగంలోకి పవన్ కళ్యాణ్ .. జాబ్ క్యాలెండర్ పై జనసేనాని పోరాటం
ఎంప్లాయిమెంట్ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్న జనసేన
ఇక ఈ రోజు నిరుద్యోగులకు అండగా ఆందోళనకు శ్రీకారం చుట్టిన జనసేన పార్టీ నేతల పరిస్థితి కూడా అదే విధంగా తయారయింది. రాష్ట్రంలో నూతన జాబ్ క్యాలెండర్ ను ప్రకటించాలని డిమాండ్ చేసిన పవన్ కళ్యాణ్, నిరుద్యోగ యువతను వైసీపీ నయ వంచనకు గురి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంప్లాయిమెంట్ ఆఫీస్ లలో అధికారులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్ని ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ లిచ్చి పోస్టుల భర్తీ చేయాలని వినతి పత్రాలు సమర్పించడానికి జనసేన పార్టీ శ్రీకారం చుట్టింది.
నిన్న రాత్రి నుండే జనసేన నాయకుల గృహ నిర్బంధాలు
ఈ క్రమంలో ఇళ్ల నుంచి బయటకు వస్తే కేసులు పెడతామంటూ పోలీసులు జనసేన నేతలను నిర్బంధాలకు గురిచేస్తున్నారు. ఇప్పటికే నోటీసులు జారీ చేసి జనసేన నేతలను అడ్డుకుంటున్నారు. ఏపీలో నిరుద్యోగ యువతకు జనసేన బాసటగా నిలిస్తే గృహనిర్బంధాలా అంటూ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడుతున్నారు. సీఎం జగన్ మాటలతో మోసపోయిన యువత పక్షాన నిలిస్తే సీఎం జగన్ ఇబ్బంది పడుతున్నారని మనోహర్ ఎద్దేవా చేశారు.
వైసీపీ సర్కార్ నియంతృత్వ పోకడలపై ఫైర్ అయిన జనసేన నేత నాదెండ్ల మనోహర్
శాంతియుతంగా జనసేన వివిధ జిల్లాలోని ఎంప్లాయిమెంట్ అధికారులకు వినతిపత్రం ఇవ్వాలనుకుంటే, దానిని కూడా అడ్డుకుంటున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు అండగా పోరాటం చేయనున్న జనసేన నాయకులను నిన్న రాత్రి నుంచి గృహ నిర్బంధంలో ఉంచడం అప్రజాస్వామికమని నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన నిలబడే పౌరులకు ఉన్న హక్కులు కూడా కాలరాస్తున్న వైసీపీ ప్రభుత్వానిది నియంతృత్వ పోకడ అని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ప్రభుత్వం ఎంత కట్టడి చేసినా సరే జనసేన నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకూ పోరాటం సాగిస్తుందని తేల్చిచెప్పారు.
రాష్ట్రంలో అన్ని జిల్లాలలోనూ పోలీసుల అరెస్టులు , నిర్బంధాలు
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో నిరుద్యోగులకు అండగా పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఉద్యోగ కల్పన అధికారికి వినతి పత్రం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పలువురు నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా నాయకులు సైతం పోలీసులు నిర్బంధించారు. శాంతియుతంగా నిరుద్యోగ సమస్య కోసం పోరాటం చేస్తున్న తమపై నిరంకుశత్వంతో అణచివేసే ప్రయత్నం చేయడం పై జనసేన నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.