స్ధానిక పోరుకు ముందు పార్టీలో చేరికలు వైసీపీకి బలమా ? బలహీనతా ?
ఏపీలో స్ధానిక పోరుకు ముందే వైసీపీలోకి టీడీపీ, జనసేన నుంచి వలసలు ఊపందుకుంటున్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తున్న నేతలకు స్ధానిక పోరు దృష్ట్యా జగన్ జెండా కప్పేస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో జంపింగ్ నేతల వల్ల వైసీపీకి లాభమా, నష్టమా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
స్ధానిక ఎన్నికలు- చేరికలు
ఏపీలో స్దానిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీలోకి టీడీపీ కీలక నేతల వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రెహమాన్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పేసుకున్నారు. అటు జగన్ సొంతగడ్డ కడప జిల్లాలోని జమ్మలమడుగుకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కూడా రేపోమాపో వైసీపీలో చేరిపోనున్నారు. ఆయనతో పాటు మొన్న శాసనమండలిలో వైసీపీకి అనుకూలంగా ఓటు వేసిన దేవగుడి శివనాథ్ రెడ్డి, ఆయన సోదరుడు దేవగుడి నారాయణరెడ్డి కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
స్ధానిక పోరు కోసమే గ్రీన్ సిగ్నల్
ఇన్నాళ్లూ వైసీపీలో చేరేందుకు పలువురు టీడీపీ సీనియర్లు, కీలక నేతలు ఎదురుచూస్తున్నా జగన్ నుంచి వారికి గ్రీన్ సిగ్నల్ రాలేదు. అప్పటికే 151 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రంలో పార్టీ దుర్భేద్యంగా ఉండటం, టీడీపీకి చెందిన నేతలను ఆహ్వానిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతో తొమ్మిది నెలలుగా జగన్ సైలెంట్ గా ఉండిపోయారు. విశాఖ జిల్లాలో విశాఖ డెయిరీ కుటుంబాన్ని, తూర్పుగోదావరి జిల్లాలో తోట త్రిమూర్తులు మినహాయిస్తే మిగతా వారిని పార్టీలోకి తీసుకునేందుకు జగన్ ససేమిరా అన్నారు. టీడీపీకి చెందిన గన్నవరం, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేలు తనను కలిసినా పార్టీలోకి చేర్చుకునేందుకు మాత్రం జగన్ అంగీకరించలేదు. కానీ స్ధానిక ఎన్నికల పోరు నేపథ్యంలో జగన్ ఓ అడుగు వెనక్కి తగ్గారు.
ఎన్నికల వేళ చేరికలు లాభిస్తాయా ?
స్ధానిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీతో పాటు జనసేనకు చెందిన నేతలను పార్టీలో చేర్చుకునేందుకు జగన్ మొగ్గు చూపడం వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో పలు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసినా స్ధానిక ఎన్నికల్లో మాత్రం టీడీపీ కాస్తో కూస్తో ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే టీడీపీ, జనసేన నుంచి సీనియర్లతో పాటు దిగువ స్ధాయి నేతలను కూడా తీసుకుంటే మంచిదని జగన్ కు పార్టీ సీనియర్లు సూచిస్తున్నారు. ఇప్పటికే జగన్ వద్ద ఇలాంటి ప్రతిపాదనలు చాలానే పెండింగ్ లో ఉన్నాయి. అయితే వీరి రాక వల్ల ఏ మేరకు లబ్ది చేకూరుతుందన్న లెక్కలు వేసుకున్నాకే వారికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
వలసలతో పలుచోట్ల వ్యతిరేకత
స్ధానిక పోరు నేపథ్యంలో వైసీపీలో చేరేందుకు వస్తున్న నేతలతో పార్టీని నమ్ముకున్న నేతల్లో వ్యతిరేకత వస్తోంది. సీఎం సొంత జిల్లా కడప లోని జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డిని తీసుకోవడంపై స్ధానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ విషయంలో సీఎం నిర్ణయం తీసుకోవడంతో చేసేది లేక తన అనుచరుల వద్ద ఆయన తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దేవగుడి సోదరులను తీసుకోవడంపైనా స్ధానికంగా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. గతంలో పార్టీ జెండాపై గెలిచి వైసీపీకి ద్రోహం చేసి అధికారం కోసం టీడీపీ పంచన చేసిన దేవగుడి కుటుంబం పేరు చెబితే కడప జిల్లాలో వైసీపీ నేతలు మండిపడే పరిస్ధితి. కానీ ప్రసుతం సీఎం నిర్ణయాలతో వారంతా మౌనంగా భరించాల్సిన పరిస్ధితి. అలాగే రాజధాని ప్రాంతంలో టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ రాకపైనా వైసీపీ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
సర్దుకుపోవాలంటున్న జగన్
స్ధానిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరుతున్న నేతలపై వ్యక్తమవుతున్నఅభ్యంతరాలపై సీఎం పలు సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్ధానిక అవసరాల రీత్యా ఇతర పార్టీ నేతలను చేర్చుకుంటున్నామని, వీరి రాకతో తమ ప్రయోజనాలు దెబ్బతినకుండా చూస్తామని వారికి వైసీపీ పెద్దల ద్వారా సమాచారం పంపుతున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మరింత మంది టీడీపీ సీనియర్లు పార్టీలో చేరితే ఎదురయ్యే వ్యతిరేకతను జగన్ ఎలా ఎదుర్కొంటారన్నది చూడాల్సిందే.