ఆలిండియా రేడియో తొలి తెలుగు మహిళా న్యూస్ రీడర్ కన్నుమూత
ఆలిండియా రేడియో తొలి తెలుగు మహిళా న్యూస్రీడర్ జోలెపాళ్యం మంగమ్మ(92) మృతి చెందారు.
చిత్తూరు: ఆలిండియా రేడియో తొలి తెలుగు మహిళా న్యూస్రీడర్ జోలెపాళ్యం మంగమ్మ(92) మృతి చెందారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. చిత్తూరు జిల్లా మదనపల్లె రెడ్డీస్ కాలనీలోని స్వగృహంలో బుధవారం తుదిశ్వాస విడిచారు. కేంద్ర సమాచారశాఖ, విదేశాం గ శాఖల్లో కీలక పదవులను మంగమ్మ నిర్వహించారు.
ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్లో లైఫ్ మెంబర్గా, అనిబీసెంట్ ఎడ్యుకేషన ల్ ట్రస్టు ఉపాధ్యక్షురాలిగా, గాంధీ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవల్పమెంట్ అధ్యక్షురాలిగా, లోక్అదాలత్లో సభ్యురాలిగా వివిధ హోదాల్లో సేవలందించారు. గురువారం మదనపల్లెలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుమారుడు భవానీప్రసాద్ తెలిపారు.
వీధిబడి చదువులతో మొదలై.. ఢిల్లీ యూనివర్శిటీ దాకా ఎదిగిన మంగమ్మ.. జే లక్ష్మమ్మ, సుబ్బయ్య దంపతులకు 1925 సెప్టెంబర్ 12న జన్మించారు. ఆలిండియా రేడియో నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణురాలై, 1960 నుంచి 64 దాకా తెలుగు రేడియో తొలి మహిళా న్యూస్రీడర్గా పనిచేశారు.
అనంతరం 35 ఏళ్లపాటు ప్రయోగాత్మక విద్యాకేంద్రం, టీచర్ ట్రైనింగ్ కేంద్రాల్లో ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఆంగ్ల, తెలుగు భాషల్లో మూడువందలకు పైగా వ్యాసాలు, పదుల సంఖ్యలో పుస్తకాలను రచించారు.
తెలుగు సాహిత్యంపై మక్కువతో మదనపల్లె రచయితల సంఘం ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. తెలుగులో ఇండియన్ పార్లమెంట్, శ్రీ అరబిందో, విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు,అనిబీసెంట్ తదితర పుస్తకాలు మంగమ్మ రచించారు. 2002లో న్యూఢిల్లీ తెలుగు అకాడమీ.. ఉగాది పురస్కారం, కుప్పం రెడ్డెమ్మ సాహితీ అవార్డు, విజయవాడ సిద్ధార్థ కళాపీఠం విశిష్ఠ అవార్డులు ఆమెను వరించాయి.
వెంకయ్య సంతాపం
మంగమ్మ మృతి పట్ల కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం బాధాకరమని ట్విట్టర్లో పేర్కొన్నారు. మంగమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు.