పిల్లలపై దౌర్జన్యం: ఎమ్మెల్యే అనిత భర్త అరెస్ట్, 14 రోజుల రిమాండ్
విశాఖ: పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత భర్త శివప్రసాద్ను విశాఖ మూడో పట్టణ పోలీసులు ఆదివారం నాడు అరెస్టు చేశారు. తాను ఇంట్లో లేని సమయంలో వచ్చి విలువైన డాక్యుమెంట్లతో పాటు తన కొడుకును కూడా అపహరించుకు వెళ్లేందుకు శివప్రసాద్ యత్నించాడని ఎమ్మెల్యే అనిత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే ఫిర్యాదు నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు భర్త శివప్రసాద్ను ఆదివారం సాయంత్రం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. శివప్రసాద్కు జడ్జి రెండు వారాల జ్యూడిషియల్ రిమాండు విధించారు. ఆయనను జైలుకు తరలించారు.
కాగా, విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత తన భర్తపై పోలీస్ స్టేషన్లో రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. తను ఇంట్లో లేనప్పుడు వచ్చి పిల్లలపై దౌర్జన్యం చేశాడని, గన్మెన్ పీఏ లను బెదిరించాడని ఫోన్లో పాయకరావుపేట త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
తాను తన భర్తను 14 ఏళ్ల పాటు భరించానని, సహనం నశించిందని ఎమ్మెల్యే అనిత ఆవేదన వ్యక్తం చేసింది. తాను ప్రేమించిన వ్యక్తిని 14 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే అనిత ఇదే పోలీస్ స్టేష్న్లో పెళ్లి చేసుకున్నారు. ఇంట్లోని విలువైన పత్రాలను తీసుకుని వెళ్లాడని ఆమె ఫిర్యాదు చేశారు.
ఇరువురి మధ్య మనస్పర్థల కారణంగా కొన్నాళ్ల నుంచి అనిత, భర్త విడివిడిగా జీవనం సాగిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్యే అనిత, భర్తకు విడాకుల నోటీసులు పంపించారు.
దీంతో ఆగ్రహానికి గురైన భర్త, ఎమ్మెల్యే ఇంట్లోకి ప్రవేశించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. బలవంతంగా పిల్లలను, ఆస్తి పత్రాలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో భర్తను అడ్డుకున్న ఎమ్మెల్యే పీఎ, గన్మెన్లపై తిరగబడ్డాడు. దీంతో అనిత పోలీసులను ఆశ్రియించారు.