సామాన్యుడి ముందు జగన్కు పరాభవం!: కొండతో ఢీ.. ఎవరీ బిటెక్ రవి?
కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటెక్ రవి విజయం సాధించారు. వైసిపి అధినేత జగన్ సొంత ఇలాకాలో బీటెక్ రవి గెలుపు తెలుగుదేశం పార్టీకి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేది.
కడప: కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటెక్ రవి విజయం సాధించారు. వైసిపి అధినేత జగన్ సొంత ఇలాకాలో బీటెక్ రవి గెలుపు తెలుగుదేశం పార్టీకి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేది.
దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత ఇక్కడ టిడిపి సత్తా చాటింది. ఈ గెలుపుతో 2019 ఎన్నికల్లోను కడప, పులివెందులలో తామే గెలుస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నుంచి టిడిపి నేతల వరకు ఢంకా బజాయిస్తున్నారు.
జగన్ ఇలాకాలో... వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డిని నిలబెట్టినప్పటికీ వైసిపి గెలువలేకపోయింది. ఇది జగన్కు గట్టి షాక్. జగన్ ఇలాకాలో గెలిచేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదిపి.. వైయస్ కంచుకోటను బద్దలు కొట్టింది.
'ఏం లాభం... బాబాయ్ని గెలిపించుకోలేకపోయారు', 'జగన్ అతి వల్లే'
ఐకమత్యంతో ఓ సామాన్యుడు కొండను ఢీ కొట్టాడు. అఖండ విజయం సాధించారు. ఈ విజయంతో ఆ సామాన్యుడి ముందు జగన్ తలవంచక తప్పలేదు. ఆ సామాన్యుడే మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి.
టీడీపీ తరుపున ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన బీటెక్ రవి.. ఇంటర్ వరకు పులివెందులలో చదివి, కర్నాటకలో బీటెక్ పూర్తి చేశారు. గత ఇరవై ఏళ్ల నుంచి టీడీపీలో ఉన్నారు.
2011లో జరిగిన ఉప ఎన్నికల్లో పులివెందుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వైయస్ వివేకానంద రెడ్డి, వైసీపీ నుంచి విజయ లక్ష్మి పోటీ చేశారు.
ఈ ఎన్నికల్లో విజయమ్మ గెలుపొందారు. ఇప్పుడు కడప ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీటెక్ రవికి టిడిపి అవకాశమిచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ వివేకా, బీటెక్ రవి హోరాహోరీగా తలపడ్డారు.
కాగా, బీటెక్ రవికి ఈ విజయం సులభంగా సాధ్యం కాలేదు. కడప జిల్లాలోని పార్టీ నేతలు ఐకమత్యంగా వ్యూహాన్ని రచించారు. అనేక ప్రయాసలకు ఓర్చి పార్టీని గెలిపించారు. ప్రజాప్రతినిధులతో పాండిచ్చేరిలో క్యాంపు నిర్వహించారు.
ఈ క్యాంపులోని నేతలు జారీపోకుండా పకడ్బందిగా ఏర్పాట్లు చేశారు. క్రాస్ ఓటింగ్పై ఆశలు పెట్టుకున్న వైసిపి ఎత్తులను చిత్తు చేశారు. వైసిపి క్రాస్ ఓటింగ్ను నమ్ముకోగా, టిడిపి కోడ్ విధానాన్ని అమలు చేసి ప్రజాప్రతినిధులు జారీ పోకుండా చూసుకుంది.
ప్రజాప్రతినిధులకు ఇచ్చే కోడ్ ఎన్నికల ఎజెంట్ వద్ద కూడా ఉంటుందని, అలాంటప్పుడు ఎవరికి ఓటు వేసేది స్పష్టంగా తెలుస్తుందని ప్రజాప్రతినిధులను హెచ్చరించింది.
ఇంచార్జిగా ఉన్న మంత్రి గంటా పాత్ర కూడా గెలుపులో ఎంతో ఉందని సీఎం చంద్రబాబు, ఇతరులు మెచ్చుకున్నారు. మరోవైపు, ఎన్నికల పరిశీలకుడిగా చంద్రబాబు సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని పంపించారు. ఈ గెలుపులో సోమిరెడ్డి కూడా కీలక పాత్ర పోషించారు.