Kakinada : కాకినాడ ప్యారీ షుగర్స్ లో షార్ట్ సర్క్యూట్-ఇద్దరు మృతి-10 మందికి గాయాలు
కాకినాడలో ఇవాళ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని వాకలపూడిలో ఉన్న ప్యారీ షుగర్స్ చక్కెర కర్మాగారంలో షార్ట్ సర్క్యూట్ అయి కన్వేయర్ బెల్ట్ తెగిన ప్రమాదంలో ఇద్దరు చనిపోగా..పలువురు గాయపడ్డారు. ఘటనా సమయంలో ఫ్యాక్టరీలో భారీ సంఖ్యలోనే కార్మికులు ఉన్నారు. అయితే కన్వేయర్ వద్ద ఉన్న వారు మాత్రమే ప్రమాదానికి గురయ్యారు.
ప్యారీ షుగర్స్ లో ప్రమాదం జరగడం దురదృష్టకరమని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ప్రమాదానికి పది మంది కార్మికులు గురయ్యారని ఆయన తెలిపారు. వీరిలో ఇద్దరు మృతి చెందారని, మరోకరు తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు పరిశ్రమ ద్వార నష్టపరిహరం అందించాలని చెప్పామన్నారు. ప్రమాద ఘటనను సిఎం జగన్ దృష్టికి తీసుకువెళ్ళి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు. పరిశ్రమ భద్రత విషయంలో తనిఖీ చేయాలని విద్యుత్, పొల్యూషన్,పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించినట్లు కన్నబాబు పేర్కొన్నారు.
ప్యారీ షుగర్స్ పరిశ్రమపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు.లోడింగ్ గోడౌన్ లో త్రీ ఫేస్ ఎంసీబీ షార్ట్ సర్క్యూట్ పేలుడు వల్ల ప్రమాదం సంభవించిందని ఆయన వెల్లడించారు.ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేయాల్సిందిగా అగ్నిమాపక, విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించామన్నారు. మరోవైపు రాష్ట్రంలోని పరిశ్రమల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాల వల్ల ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్ధితులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ చేయాలని సీఎం జగన్ పదే పదే చెప్తున్నా క్షేత్రస్ధాయిలో మాత్రం అధికారులు స్పందించడం లేదు.