సినిమాపైనా దాడి, బాబుకు భయం: పాట పాడానని నవ్వించిన కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ ఎలా వస్తుందోనని తాను చెబితే సినిమాల్లాగా చేస్తున్నారని చాలామంది ఎద్దేవా చేశారని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆదివారం అన్నారు. తెలంగాణ కళాకారుల సమ్మేళనంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాల్గొని, మాట్లాడారు. రమసయి ఆధ్వర్యంలో జరిగిన సమ్మేళనానికి కేసీఆర్ హాజరయ్యారు. కళాకారులు ప్రభుత్వ ఉద్యోగులు కావడం సంతోషకరమన్నారు.
కళాకారులకు హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పారు. ఉద్యమంలో కళాకారుల సేవలు మరువలేనివన్నారు. బంగారు తెలంగాణలోను కళాకారులు భాగస్వాములు కావాలన్నారు. తెలంగాణ వస్తదా అని చాలామంది అనుమానించారని, కొందరు అన్యాయం చేశారని, మరికొందరు మధ్యలోనే వదిలేశారని అన్నారు.
2001లలో తెలంగాణ కోసం తాను బయల్దేరినప్పుడు ఒక్కడినే అన్నారు. సంఘటిత శక్తితో తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. తెలంగాణ కోసం ప్రజల్లో విశ్వాసం నెలకొల్పేందుకు చాలా సమయం పట్టిందన్నారు. ఉద్యమం సమయంలో కళాకారుల కష్టాలు అన్నీ ఇన్నీ కావన్నారు.
వెనుకబడిన జాతులను ముందుకు తీసుకు వచ్చినప్పుడే తెలంగాణకు అసలైన అర్థమన్నారు. ఉన్నోడికి చేసి ఏం లాభమన్నారు. అలాంటి వారికి ఎలాగు ఉందన్నారు. కళాకారులు ఉద్యమంలోనే జీవించారని, తపించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కోతులు అడవుల్లోకి వాపస్ పోవాలని, వర్షాలు రావాలని అన్నారు. హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులే రేపటి తెలంగాణ భవిష్యత్తు అన్నారు.
సమైక్య ఏపీలో బోర్లు వేసిన రైతన్నలు బొక్క బోర్లా పడ్డారన్నారు. అందుకే మిషన్ కాకతీయ చేపట్టామన్నారు. మిషన్ కాకతీయ పరామర్థం ఏమిటో ప్రజలకు కళాకారులు చెప్పాలన్నారు. వాటర్ షెడ్ అంటే ప్రపంచానికి చెప్పింది కాకతీయులు అన్నారు. తెలంగాణలో 300 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంతో పాటు దీర్ఘ కాలిక లక్ష్యాలతో ముందుకుపోతామన్నారు.
తెలంగాణ నుండి వందకు వంద శాతం దారిద్రాన్ని తరిమి కొడతామన్నారు. అందరి ముఖాల్లో చిరునవ్వులు రావాలన్నారు. ఉద్యమ కాలంలో కళాకారుల పాటలకు ఎన్నోసార్లు ఏడ్చామని, ప్రత్యర్థుల కుట్రలను తిప్పి కొట్టామన్నారు. సినిమాల్లో కూడా తెలంగాణ పైన ఘోర దాడి జరిగిందన్నారు. ఉద్యమంలో చిట్ట చివరి వరకు తమ వెంట నిలిచింది కళాకారులే అన్నారు.
తెలంగాణ కోసం కొందరు పోలీసులు ఉద్యోగాలు వదులుకున్నారన్నారు. చాలామంది నాయకులు తెలంగాణ సమయంలో అమ్ముడుపోయారని చెప్పారు. ఆంధ్రా ముఖ్యమంత్రికి తెలంగాణ చెప్పులు అన్నా, మా డప్పులు అన్నా భయమేనని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి అన్నారు.
టీడీపీ వాళ్లు తక్కువోళ్లు కాదు
తెలుగుదేశం పార్టీ వాళ్లు తక్కువ వాళ్లు కాదని, ఉద్యమంను కార్నర్ చేసేందుకు వారు ఎన్నో ప్రయత్నాలు చేశారని, కానీ వారిని ప్రజలు గుర్తించలేదని కేసీఆర్ అన్నారు. ప్రజల సంఘటిత శక్తే తెలంగాణ తెచ్చిందన్నారు.
చిన్నప్పుడు పాటలు పాడేవాణ్ని, పాడమంటారు..
తాను చిన్నప్పుడు పాటలు పాడేవాడినని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా పలువురు కేసీఆర్ పాట పాడాలని కోరారు. ఇప్పుడు నన్ను పాడమంటారా అంటూ కేసీఆర్.. ఓ పద్యం చెప్పి వినిపించారు. ఆయన ఆధ్యంతం గేయాలు, పద్యాలతో కళాకారులను ఆకట్టుకున్నారు. కేసీఆర్ తన మాటలతో, పాత జ్ఞాపకాలు చెబుతూ కళాకారులను ఆధ్యంతం నవ్వించారు.