ఉచిత సలహాలొద్దు చంద్రబాబు; రాజీనామాలు ఎప్పుడు చెయ్యాలో మాకు తెలుసు: కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై టీడీపీ నాయకులపై నిరంతర విమర్శలు గుప్పించే, మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మరోమారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేశారు. పోలవరం కోసం 23 మంది వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని తాజాగా చంద్రబాబు నాయుడు చేసిన సవాల్ పై భగ్గుమన్న మాజీ మంత్రి కొడాలి నాని తమకు, వైఎస్ జగన్ కు ఎప్పుడు రాజీనామాలు చెయ్యాలో తెలుసు అంటూ, చంద్రబాబు ఉచిత సలహాలు ఇవ్వటం మానుకోవాలని హితవు పలికారు.

భారత దేశంలోనే అత్యంత పిరికి నాయకుడు చంద్రబాబు
ఎప్పుడు ఏం చేయాలో జగన్ మోహన్ రెడ్డి బాగా తెలుసని, తమకు చంద్రబాబు సలహా అవసరం లేదని కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఉచిత సలహాలు ఇవ్వటం మాని ముందు తెలుగుదేశం పార్టీ ముగ్గురు ఎంపీలు, రాజ్యసభ సభ్యులచే రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు కొడాలి నాని. రాజకీయాల కోసం చంద్రబాబు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు అంటూ మండిపడ్డారు. భారత దేశంలోనే అత్యంత పిరికి నాయకుడు ఎవరైనా ఉంటే అది చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు కొడాలి నాని.

ఎమ్మెల్యేను కాదు కదా సర్పంచ్ ను కూడా రాజీనామా చేయించని చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసు
ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామాలు చేయించి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి మళ్లీ పోటీ చేయించి గెలిపించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అని కొడాలి నాని చెప్పుకొచ్చారు. ఇక రాజీనామాలపై వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు రాష్ట్రంలోని ఏ సమస్య పైన ఎమ్మెల్యే కాదు కదా సర్పంచును కూడా రాజీనామా చేయించి ఎరగడు అంటూ సెటైర్లు వేశారు. ఎన్నికలంటే పారిపోయిన చంద్రబాబు తమకు సలహాలు ఇవ్వటం ఏంటి అంటూ మండిపడిన కొడాలి నాని, చంద్రబాబు ఇచ్చిన సలహాలు చూసి జనాలు నవ్వుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు.

వైసీపీ ఎంపీలు రాజీనామా చెయ్యాలని చంద్రబాబు సవాల్
నిన్నటికి నిన్న ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాలలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం మెడలు వంచుతాం అని సీఎం జగన్ చెప్పుకొచ్చాడని, కానీ ఇప్పుడు తానే తలవంచుకున్నాడు అని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుండి నిధులు రప్పించడం కోసం దమ్ముంటే వైసీపీ ఎంపీ అందరూ రాజీనామాలు చేయాలని చంద్రబాబు సవాల్ విసిరారు. అప్పుడు కేంద్ర ప్యాకేజీతో ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాదో చూద్దాం అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.

జగన్ పై, వైసీపీ ఎంపీల తీరుపై చంద్రబాబు నిప్పులు .. కొడాలి నానీ ఎదురుదాడి
కేంద్రం వద్ద వైసీపీ ఎంపీలు అసమర్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడిన చంద్రబాబు, గతంలో పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజలను కష్టాల్లో ఉన్న సమయంలో నిండు గోదారిలో ముంచారు అంటూ మండిపడ్డారు. ఇక ప్రత్యేక హోదాను మరచిపోయారని, పోలవరం ముంపు మండలాల పరిహారం గాలికి వదిలేశారని మండిపడ్డారు. జగన్ సర్కార్ పాలనా వైఫల్యం వల్లే వరదలు వచ్చాయని మండిపడ్డారు. ఇక తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని మీ సలహాలు మాకు అవసరం లేదంటూ సెటైర్లు వేశారు.












Click it and Unblock the Notifications