Ambati Rambabu : మంత్రి అంబటి రాంబాబుకు ఝలక్-కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు..
ఏపీలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే, జలవనరుల మంత్రి అంబటి రాంబాబుకు స్ధానిక కోర్టు ఇవాళ ఝలక్ ఇచ్చింది. స్ధానికంగా సంక్రాంతి సందర్భంగా డ్రా పేరుతో టికెట్ల వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై మంత్రిపై కేసు నమోదుచేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది.
సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతి డ్రా పేరుతో స్ధానికంగా వసూళ్లు చేస్తున్నట్లు జనసేన నేతలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై పోలీసుల్ని కలిసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు దీనిపై స్పందించలేదు. దీంతో వారు స్ధానిక న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన స్ధానిక కోర్టు.. అంబటిపై కేసు నమోదు చేయాలని సత్తెనపల్లి పోలీసుల్ని ఆదేశించింది.

వాస్తవానికి సత్తెనపల్లిలో తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ నిర్వహించారు. అప్పటి నుంచి అంబటికీ,జనసేన నేతలకూ మధ్య పోరు సాగుతోంది. స్ధానికంగా ఓ మహిళకు ప్రభుత్వం ఇచ్చిన సాయంలో వాటా అడిగారంటూ జనసేన నేతలు ఆరోపించారు. దీనిపై అంబటి స్పందించి సమాధానం ఇచ్చుకోవాల్సి వచ్చింది. అనంతరం స్ధానికంగా సంక్రాంతి డ్రా నిర్వహణపైనా జనసేన నేతలు అంబటిని టార్గెట్ చేశారు. దీంతో అంబటి ఇరుకునపడ్డారు. అయితే పోలీసులు మాత్రం జనసేన నేతల ఫిర్యాదును లైట్ తీసుకోవడంతో వారు కోర్టును ఆశ్రయించి కేసు నమోదు ఆదేశాలు తెచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications