హోదాపై వెంకయ్య మరోసారి తిరకాసు, కానీ: పుష్కర మృతులకు నివాళి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక హోదా విషయమై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మరోసారి ఝలకిచ్చారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన బిల్లులో ప్రత్యేక హోదా అంశం లేదని ఆయన స్పష్టం చేశారు.
కానీ, ఎంపీలు మాత్రం విభజన బిల్లుపై సవరణలు అడుగుతున్నారని, దీని పైన పరిశీలిస్తామని చెప్పారు. చట్టంలో ప్రత్యేక హోదా అంశం లేదని మొదటి నుంచి బిజెపి.. కాంగ్రెస్ పార్టీని తప్పుపడుతోంది.
ఏపీ సమస్యలు లేవనెత్తుతాం: రామ్మోహన్ నాయుడు
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంటులో లేవెనత్తుతామని టిడిపి శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఉదయం ఆయన ఢిల్లీలో మాట్లాడారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏఫీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. రాష్ట్రానికి వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక నిధులు కూడా కావాలన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ రాష్ట్రం కోసం గళమెత్తుతామని చెప్పారు.
గోదావరి పుష్కర మృతులకు లోకసభ నివాళి
బుధవారం నాడు రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట మృతులకు లోకసభ నివాళులర్పించింది. సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించి మృతులకు సంతాపం తెలిపారు.
గోదావరి పుష్కరాల ప్రారంభం రోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 27మంది మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, రెండో రోజు లోకసభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదాపడింది. లలిత్ మోడీ అంశం, వ్యాపం కుంభకోణంపై విపక్ష సభ్యులు నిరసన చేపట్టారు. లోకసభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టడంతో గందరగోళం నెలకొంది.
విపక్ష సభ్యుల ఆందోళన మధ్యే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. విపక్ష సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్ సభను 12గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నల్ల బ్యాడ్జీలతో వచ్చి నిరసన తెలిపారు.












Click it and Unblock the Notifications