ఏపీ మంత్రికే షాకిచ్చిన ఇసుకాసురులు- ఆన్ లైన్ ఆర్డర్ లో నాసిరకం ఇసుక.. అవాక్కైన వైనం..
ఏపీలో మరోసారి ఇసుక కొరత సమస్య విజృంభించేలా కనిపిస్తోంది. ప్రభుత్వం,, అదికారులు ఎంత లేదని చెబుతున్నా ప్రతీ రోజూ రాష్ట్రంలో చాలా చోట్ల ఇసుకపై ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. నాణ్యమైన ఇసుకను బ్లాక్ లో అమ్ముకుంటున్న అధికారులు... నాసిరకం ఇసుకను మాత్రం వినియోగదారులకు అంటగట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఇదే క్రమంలో సాక్ష్యాత్తూ రాష్ట్రమంత్రికే ఇలా నాసిరకం ఇసుక రావడంతో ఆయన అవాక్కయ్యారు.

ఏపీ మంత్రికి ఇసుక షాక్...
గతేడాది వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక దాదాపు 9 నెలల పాటు వేధించిన ఇసుక సంక్షోభం మళ్లీ మొదలైనట్లే కనిపిస్తోంది. సీఎం జగన్ ఎన్ని సమీక్షలు నిర్వహిస్తున్నా, మంత్రులకు ఎన్నిసార్లు వార్నింగ్ లు ఇస్తున్నా, ఎన్ని టాస్క్ ఫోర్స్ లు నియమించినా ఇసుక సమస్యకు మాత్రం పరిష్కారం లభించడం లేదు. ఇసుకాసురులు యథేచ్ఛగా నాణ్యమైన ఇసుకను బ్లాక్ లో అమ్ముకుంటూ నాసిరకం ఇసుకను జనానికి అంటగడుతున్నారు. ఇదే కోవలో తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఓ మంత్రి ఇసుకను ఆన్ లైన్ లో ఆర్డర్ చేయగా నాసిరకం ఇసుక ఇంటికొచ్చింది. దీంతో ఆయనకు ఏం చేయాలో తెలియలేదు.

అసలేం జరిగిందంటే....
ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తన సొంత నియోజకవర్గం అమలాపురం పరిధిలోకి వచ్చే భట్నవిల్లిలో సొంత ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం నాలుగు లారీల ఇసుకను ఆన్ లైన్లో ఆర్డర్ చేశారు. నిన్న ఉదయం ఇంటి నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి నాలుగు లారీలు వచ్చాయి. తీరా చూస్తే అంతా మట్టితో కూడిన నాసిరకం ఇసుకే. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కలెక్టర్ మురళీధర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో మైనింగ్ అధికారులు మంత్రి ఇంటిని సందర్శించి ఆ ఇసుక నిర్మాణానికి పనికి రాదని తేల్చేశారు. దీంతో మరో నాలుగు లారీల్లో ఇసుక మార్చి పంపించారు.
Recommended Video

అవాక్కైన మంత్రి, సీఎంకు ఫిర్యాదు ?
కేబినెట్ సమావేశాల్లో ఇసుక కొరతపై గత ఏడాది కాలంలో పలుమార్లు సీరియస్ చర్చలే జరిగాయి. రాష్ట్రంలో అందరికీ నాణ్యమైన ఇసుకను అందుబాటులో ఉంచాలని జగన్ నేరుగా ఆదేశాలు ఇచ్చారు.. అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ లను నియమించారు. ఇన్ని జరుగుతున్నా అక్రమార్కులు మాత్రం జనానికి చుక్కలు చూపిస్తున్నారు. అదే క్రమంలో మంత్రి విశ్వరూప్ కూడా బాధితుడు కావడంతో ఆయన నేరుగా సీఎంకే ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. మంత్రికే నాసిరకం ఇసుక అంటగట్టేందుకు అధికారులు ప్రయత్నించడంపై ఆయన చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. మంత్రి పరిస్ధితి ఇలా ఉంటే రాష్ట్రంలో సామాన్యులకు నాణ్యమైన ఇసుక అందుతుందని ఎలా భావిస్తామని కలెక్టర్ మురళీధర్ రెడ్డిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications