చంద్రబాబులో చేవ లేదు.. దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వచ్చినా టీడీపీని పైకి లేపలేడు!!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి జోగి రమేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు కుప్పం పర్యటన లో చెత్త వాగుడు వాగున్నారని ఆయన మండిపడ్డారు. తాము పోలీస్ యాక్ట్ ప్రకారమే జీవో ఇచ్చామని, ఆ జీవోను చంద్రబాబు పూర్తిగా చదివితే బాగుంటుంది అంటూ హితవు పలికారు. చంద్రబాబు జీవో చదవకుండానే ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జోగి రమేష్ విమర్శించారు.

కుప్పంలో చంద్రబాబు పోలీసులపై నోరు పారేసుకున్నారు
అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న చంద్రబాబు, పోలీసుల పైన కూడా దాడులు చేయిస్తున్నారని మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో చంద్రబాబు పోలీసులపై నోరు పారేసుకున్నాడు అని, కుప్పంలో చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఏమీ లేదని మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అసలు కుప్పంలో ఓటు కూడా లేదన్నారు. కుప్పంలోనూ చంద్రబాబు ప్రజలకు చేసిన మేలేమీ లేదన్నారు. అందుకే కుప్పం ప్రజలు చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతున్నారన్నారు జోగి రమేష్.

కొత్త సంవత్సరం రక్తపాతానికి ఆయనే కారణం
చంద్రబాబు కుట్ర రాజకీయాల వల్ల చాలా జీవితాలు రోడ్డున పడ్డాయని అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తాడు అని తెలిసే ఇటువంటి జీవో తీసుకువచ్చామని మంత్రి జోగి రమేష్ తెలిపారు. చంద్రబాబు ని టార్గెట్ చేస్తూ కొత్త సంవత్సరం వరకు కందుకూరు, గుంటూరులో రక్తపాతానికి చంద్రబాబు కారకుడు అయ్యాడని ఆరోపించారు. చంద్రబాబు కుప్పం పర్యటన పై అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబులో దమ్ము లేదని, ఆయనలో చేవ లేదని, చంద్రబాబు చతికిలపడిపోయారని మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ పనైపోయింది ... మోకులు కట్టి లాగినా, బుల్డోజర్లు వాడినా లేచే పరిస్థితి లేదు
చంద్రబాబును చూస్తే తమకు భయం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారని, సంక్షేమ పథకాలతో ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు చేరువయ్యారు అని, పేదలకు దగ్గరయ్యారని జోగి రమేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ పడిపోయిన పార్టీ అని.. మోకులు కట్టి లేపినా, బుల్డోజర్ లు కట్టి లాగినా ఆ పార్టీ లేచే పరిస్థితి లేదని మంత్రి జోగి రమేష్ అభిప్రాయపడ్డారు. ఇక దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ వచ్చినా ఆ పార్టీని మళ్లీ లేప లేరని జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications