డ్రగ్స్ పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాలు; లోకేష్, బోండా ఉమాలకు డ్రగ్స్ తీసుకునే లక్షణాలు : మంత్రి వెల్లంపల్లి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పరిషత్ ఫలితాలతో విపక్ష పార్టీలకు గుబులు పట్టుకుందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైందని, ఆ ఓటమి నుండి ప్రజల దృష్టిని మళ్ళించడం కోసమే ఏపీ ప్రభుత్వానికి డ్రగ్స్ మాఫియా మరకలు అంటించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పరిషత్ ఎన్నికల ఫలితాలతో వైఎస్ఆర్సిపి మినహా రాష్ట్రంలో మిగతా పార్టీలకు చోటు లేదని ప్రజలు మరోసారి రుజువు చేశారని మంత్రి వెల్లంపల్లి అభిప్రాయపడ్డారు.
డ్రగ్స్ తీసుకునే లక్షణాలు లోకేష్, బోండా ఉమలతోపాటు ఆ టీడీపీ నేతలకే
రాష్ట్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అసత్య ఆరోపణలు చేస్తోందని, అయినా రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మాటలు నమ్మేలా లేరని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు డ్రగ్స్ సేవించి మాట్లాడుతున్నట్లుగా ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఫామ్ హౌస్ లో కూర్చున్న వారు కూడా మాదకద్రవ్యాల గురించి మాట్లాడుతున్నారని మంత్రి వెల్లంపల్లి అసహనం వ్యక్తం చేశారు. డ్రగ్స్ తీసుకునే లక్షణాలు లోకేష్, బోండా ఉమ, అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమా, పట్టాభిలలో కనిపిస్తున్నాయని అందుకే వాళ్లంతా మతి తప్పి గతి తప్పి వెధవల్లా మాట్లాడుతున్నారని మంత్రి వెల్లంపల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుజరాత్ లో డ్రగ్స్ పట్టుబడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆపాదిస్తున్నారు
అయినా ఏపీలో వైసీపీ పాలనలో డ్రగ్స్ దొరికే అవకాశం లేదని, పక్క రాష్ట్రాలకు వెళ్లి వారంతా డ్రగ్స్ తీసుకుని ఉంటారని వెల్లంపల్లి ఆరోపించారు. డ్రగ్స్ అంటూ బోండా ఉమా మొదలు చెంచాలు ఆరోపణలు చేస్తున్నారని, ఎక్కడో గుజరాత్ లో డ్రగ్స్ పట్టుబడితే దానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆపాదిస్తున్నారు అని , ప్రజలను మభ్య పెట్టడం కోసం ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి ధ్వజమెత్తారు. ఏపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక నిత్యం చంద్రబాబు ఏవేవో కుట్రలకు తెరతీస్తున్నారని వెల్లంపల్లి అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తిరిగినా సరే ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం..
పరిషత్ ఎన్నికల లెక్కింపు లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి 86% ఎంపీటీసీ సీట్లు, 98 శాతం జడ్పిటిసి సీట్లు వచ్చాయని పేర్కొన్న మంత్రి వెల్లంపల్లి దీంతో తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీల్లోనూ భయం మొదలైందని చెప్పుకొచ్చారు. ప్రజలు ఏకపక్షంగా జగన్ పార్టీకి మద్దతు తెలిపారని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికలలోనూ వైసీపీ ప్రభంజనం సృష్టించింది అని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాళ్లకు బలపాలు కట్టుకుని సందు సందులోనూ తిరిగారని అయినప్పటికీ ప్రజలు మాత్రం వైఎస్ఆర్సీపీ కే పట్టం కట్టారని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు.
పార్టీ లేదు బొక్కా లేదు.. అచ్చెన్న భోజనం చేస్తూ చెప్పింది వాస్తవం
తిరుపతి ఉప ఎన్నిక సమయంలో టీడీపీ సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడు భోజనం చేస్తూ చెప్పిన మాటలు వాస్తవమని.. పార్టీ లేదు బొక్క లేదు అని నాడు అచ్చెన్నాయుడు చెప్పాడని గుర్తు చేశారు. అన్నం తింటూ చెప్పిన మాటలు అబద్దాలు కాదని పేర్కొన్నారు. లోకేష్ ప్రవాసాంధ్రుడులా వచ్చి పోతాడని, ఇక చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గెస్ట్ మాదిరిగా వచ్చి గెస్ట్ హౌస్ లో ఉండి వెళుతున్నాడని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఇలాంటి వారిని ప్రజలు ఎలా నమ్ముతారో చెప్పాలని మంత్రి వెల్లంపల్లి ప్రశ్నించారు.
కుప్పంలోనూ ప్రజలు చంద్రబాబును ఛీ కొట్టారు
గత ఎన్నికల్లో నారా లోకేష్ కు మంగళగిరి ప్రజలు బుద్ధి చెబితే, ఇప్పుడు కుప్పం ప్రజలు చంద్రబాబును ఛీ కొట్టారని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. కుప్పం ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపారని, చంద్రబాబుపై విశ్వాసం లేదని స్పష్టంగా చెప్పారని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. ఎన్టీఆర్ సొంతూరు నిమ్మకూరు ప్రజలు కూడా వైయస్ జగన్ కి ఓటు వేస్తారని, లోకేష్ భువనేశ్వరి దత్తత గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ కే పట్టం కట్టారని మంత్రి వెల్లంపల్లి తెలిపారు.
జగన్ కు డ్రగ్స్ తో లింకులు అంటగట్టడం వారి ఉన్మాదం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి డ్రగ్స్ తో లింకులు ఉన్నాయని అంటగడుతూ టిడిపి నేతలు మాట్లాడడం వారి ఉన్మాదానికి పరాకాష్ట అని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. టిడిపి నాయకుల కంటే ఎక్కువ తాము కూడా మాట్లాడగలమని, కానీ జగన్ వంటి గొప్ప నాయకుడి ఆధ్వర్యంలో నడుస్తున్న పార్టీ సభ్యులము కాబట్టి కొంచెం అదుపులో ఉన్నామంటూ, మంత్రుల స్థానంలో ఉన్నాం కాబట్టి బాధ్యతగా ఉన్నామంటూ పేర్కొన్నారు. రోజుకో రకం డ్రామాలతో ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని కానీ ప్రజలు నమ్మే స్థితిలో లేరని అభిప్రాయపడ్డారు.
Recommended Video
మతాలు, కులాలు, ఇప్పుడు మాదక ద్రవ్యాలు .. బాబు కొత్త డ్రామాలు
గతంలో రథాలను, దేవుడి విగ్రహాలను ధ్వంసం చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, ఆ తర్వాత కులాలను రెచ్చగొట్టారని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా డ్రగ్స్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టారని, రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారంటే ఇదంతా టిడిపి ఆఫీస్ కేంద్రంగానే జరిగిందంటూ భగ్గుమన్నారు. గతంలో బోండా ఉమ బైక్ రేస్ లో దొరికాడని, అలాంటి వారికే డ్రగ్స్ అలవాటు ఉంటాయని బెల్లంపల్లి విమర్శించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన తులసివనం మాదిరిగా సాగుతుందని, అందులో టిడిపి నేతలనే గంజాయి మొక్కలను పీకాల్సి ఉందని వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు మానుకుని రాష్ట్ర అభివృద్ధికి సూచనలు చేయాలని వెల్లంపల్లి శ్రీనివాస్ సూచించారు.