మంత్రి రావెల మిస్సింగ్!.. ఉత్కంఠగా ఆ మూడు గంటలు.. చంద్రబాబు వార్నింగ్
విషయం తెలుసుకున్న చంద్రబాబు మాత్రం 'ఇదేం పద్దతి?' అంటూ రావెలను హెచ్చరించినట్టుగా తెలుస్తోంది.
అమరావతి: అసలే ఏపీ సీఎంకు ఓవైపు నుంచి మావోయిస్టు బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఇలాంటి సమయంలో మంత్రులు సైతం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. కానీ మంత్రి రావెల కిశోర్ బాబుకు ఇవేవి పట్టనట్టున్నాయి. కనీసం భద్రతా సిబ్బంది కూడా చెప్పకుండా మూడు గంటల పాటు ఆయన మాయమైపోవడంతో.. అధికారుల్లో టెన్షన్ మొదలైంది.
ఇంతకీ అసలు విషయమేంటంటే.. మంగళవారం సాయంత్రం 6గం. ప్రాంతంలో తన కార్యక్రమాలన్ని ముగించుకుని రావెల తన ఇంటికి చేరుకున్నారు. బయట గన్మెన్లు కాపలాగా ఉన్నారు. ఇంతలో ఓ ప్రైవేటు కారు వచ్చి ఇంటి ముందు ఆగడంతో.. మంత్రి రావెల అందులో ఎక్కి వెళ్లిపోయారు.
ఎక్కడికెళ్లారో తెలియక ఆందోళన:
మంత్రి రావెల ఎక్కడికెళ్లారు.. ఎవరితో వెళ్లారన్న దానిపై ఎవరికీ సమాచారం లేదు. తిరిగి రాత్రి 10గం.లకు ఆయన ఇంటికి తిరిగొచ్చేదాకా ఎలాంటి సమాచారం లేకపోవడంతో భద్రతా సిబ్బంది ఆందోళన చెందారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఇంటలిజెన్స్ కూడా రంగంలోకి దిగింది.
ఇదేం పద్దతి రావెల?:
రావెల ఇంటికి క్షేమంగా తిరిగి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న చంద్రబాబు మాత్రం 'ఇదేం పద్దతి?' అంటూ రావెలను హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. రాజేంద్రనగర్ లో ఉన్న మిత్రుడి ఇంట్లో భోజనానికి వెళ్లొచ్చినట్టుగా రావెల దీనిపై వివరణ ఇచ్చారు.
నువ్వెవరో తెలియకపోయినా పదవి ఇచ్చా:
మంత్రి రావెల మిస్సింగ్ కు ముందు.. బుధవారం ఉండవల్లిలోని సీఎం నివాసంలో పార్టీ రాష్ట్ర సమన్వయ సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జానీమూన్ కు, మంత్రి రావెలకు మధ్య ఉన్న విభేదాల గురించి చంద్రబాబు ప్రస్తావించారు.
జానీమూన్ తో విభేదాల గురించి మాట్లాడుతూ.. పార్టీ పరువు బజారుకీడుస్తున్నావంటూ రావెలపై చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికలకు ముందు నువ్వెవరో తెలియకపోయినా.. మంత్రి పదవి ఇచ్చినందుకు ఇలా పార్టీని రచ్చకీడ్చడం సమంజసం కాదని రావెలను మందలించారు.
ఇద్దరు కలిసి పార్టీ పరువును బజారుకీడ్చి..
'నువ్వెవరో నాకు తెలియదు. నిన్నెవరో నా వద్దకు తీసుకొస్తే టికెట్ ఇచ్చా. జానీమూన్ కూడా ఎవరో తెలియదు. నువ్వు, పుల్లారావు కలిసి ఆమెను తీసుకొచ్చారు. మీరు చెప్పారు కాబట్టి ఆమెను జిల్లా పరిషత్ చైర్పర్సన్ను చేశా. ఇప్పుడు మీరిద్దరూ గొడవపడి పార్టీ పరువును బజారుకు ఈడుస్తారా? కొత్తగా పదవులు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. కానీ మీరు విఫలమయ్యారు'.. అంటూ చంద్రబాబు రావెలకు ఉపోద్ఘాతం చేశారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో తాను రాజీపడే వ్యక్తిని కాదని చంద్రబాబు ఆయన్ను హెచ్చరించారు.