మూడు రాజధానుల రద్దు జగన్ నాటకం; అమరావతిపై తేల్చేదాకా టీడీపీ పోరాటం: ఎంపీ రామ్మోహన్ నాయుడు
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎవరూ ఊహించని విధంగా మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనం రేకెత్తించింది. సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ విపక్షాలు ఇప్పటికే ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ప్రకటించగా, సీఎం జగన్ తాజా నిర్ణయంపై తెలుగు తమ్ముళ్ల లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కోర్టులో మూడు రాజధానుల బిల్లులు నిలబడవని తెలిసే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తుంటే, మరికొందరు వైఎస్ వివేకానంద రెడ్డి కేసు నుండి జనం దృష్టి మరల్చటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. తాజాగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

జగన్ నిర్ణయం వెనుక కుట్ర .. రామ్మోహన్ నాయుడు అనుమానం
వికేంద్రీకరణ బిల్లు పూర్తిస్థాయిలో రద్దు చేయాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. రాజధానులు బిల్లును వెనక్కి తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంపై స్పందించిన రామ్మోహన్ నాయుడు, ఇంత సడన్ గా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఏదైనా కుట్ర ఉందా అన్న అనుమానం కలుగుతోందని అభిప్రాయపడ్డారు. ప్రజలను గందరగోళంలోకి నెట్టకుండా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు.

అమరావతిపై జగన్ ప్రకటన చేసే వరకు టీడీపీ పోరాటం
రాజధాని అమరావతి విషయంలో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ గట్టిగా పోరాడుతుందని పేర్కొన్న రామ్మోహన్ నాయుడు తాజా నిర్ణయంతో ముఖ్యమంత్రి మరో నాటకానికి తెర లేపుతున్నారు అనుమానం కలుగుతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించే వరకూ తెలుగుదేశం పార్టీ పోరాటం సాగిస్తూనే ఉంటుందని ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్య విలువలు దిగజారి పోతున్నాయని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు రామ్మోహన్నాయుడు.

చంద్రబాబుకు ఎమ్మెల్యేలతో క్షమాపణ చెప్పించండి
చంద్రబాబు కుటుంబ సభ్యులపై వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని పేర్కొన్న ఆయన, దేవాలయం లాంటి అసెంబ్లీలో చంద్రబాబుకి జరిగిన అవమానం వెనుక జగన్ పాత్ర ఉందంటూ ఆరోపించారు. నిజంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి మహిళలంటే గౌరవం ఉంటే, తమ శాసన సభ్యులతో క్షమాపణలు చెప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబునే తీవ్ర మనస్తాపానికి గురి చేశారని అసహనం వ్యక్తం చేశారు రామ్మోహన్ నాయుడు.

రాష్ట్ర పోలీస్ వ్యవస్థపై మండిపడిన రామ్మోహన్ నాయుడు
ఇదే సమయంలో ఏపీ లో ఉన్న రాష్ట్ర పోలీసు వ్యవస్థ పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు రామ్మోహన్నాయుడు. భారతదేశ చరిత్రలోనే రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఇంతగా దిగజారటం ఏ రాష్ట్రంలో చూడలేదని రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు. సమాజంలో గౌరవంగా బ్రతకాల్సిన పోలీసులు బజారు రౌడీలలా వ్యవహరిస్తున్నారని, అధికార పార్టీ కండువా కప్పుకొని పనిచేస్తున్నారని రామ్మోహన్ నాయుడు పోలీసుల పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు కేసులకు భయపడేది లేదని, కార్యకర్తలు మరింత కసితో పని చేయాలని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సీఎం జగన్ వైఫల్యాలను ఎత్తి చూపితే టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి, అర్ధరాత్రులు ఇళ్లల్లోకి వచ్చి అరెస్టు చేస్తున్నారని రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. పోలీసుల వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జగన్ తీరు మార్చుకోవాలని హితవు పలికారు.












Click it and Unblock the Notifications