డ్రైవింగ్, దూర ప్రయాణాలపై హరికృష్ణకు ముందే సిద్ధాంతి సూచనలు?
హైదరాబాద్/అమరావతి: మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణకు ఓ సిద్ధాంతి డ్రైవింగ్ విషయంలో సూచనలు చేశారా? వాటిని ఆయన పక్కన పెట్టారా? అనే చర్చ సాగుతోంది. దీనిపై మీడియాలో వార్తలు వస్తున్నాయి.
చదవండి: హరికృష్ణ ప్రాణం తీసిన వాటర్ బాటిల్! 14 అడుగుల మేర గాల్లోకి లేచిన కారు
అక్టోబర్ వరకు డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలని హరికృష్ణకు ఓ సిద్ధాంతి సూచనలు చేశారని తెలుస్తోంది. దూర ప్రయాణాలు మానుకోవాలని కూడా హితవు పలికారని సమాచారం. కానీ పని చేయడానికి వచ్చిన నలుగురు డ్రైవర్లకు ఛార్జీలు ఇచ్చి మరీ హరికృష్ణ పంపించారని చెబుతున్నారు.
నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇది నందమూరి కుటుంబంలో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో, నందమూరి అభిమానుల్లో పెను విషాదాన్ని నింపింది.
చదవండి: జూఎన్టీఆర్ను ఓదార్చిన కేసీఆర్, బాబుకు పరామర్శ: మానసిక ఒత్తిడి.. మోత్కుపల్లి కంటతడి
హరికృష్ణ ప్రతి రోజు అబిడ్స్లోని తన ఆహ్వానం హోటల్కు వచ్చేవారని, మంగళవారం ఆయన వచ్చి తాను వెళ్తున్నానని, మళ్లీ వస్తానో రానో అని చెప్పారని హోటల్ సిబ్బంది గుర్తు చేసుకున్నారు. తాను వస్తానో.. రానో తెలియదని చెబుతూ నవ్వుతూ వెళ్లారని కృష్ణారావు అనే హోటల్ సిబ్బంది చెప్పారు.
భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్లోని పలు పాంత్రాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. బేగంపేట్ నుంచి మెహిదీపట్నం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బేగంపేట, పంజాగుట్ట, నాగార్జున సర్కిల్, జీవీకే, మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నంలో వాహనాలు నిలిచిపోయాయి. హరికృష్ణ భౌతికకాయాన్ని సందర్శించడానికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు మెహిదీపట్నంలోని ఆయన భౌతికకాయం ఉంచిన నివాసానికి తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ఆ మార్గంలో వెళ్లే వాహనచోదకులు వేరే మార్గాల్లో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.