జీఎస్టీపై స్పందించిన నారా బ్రాహ్మణి: ఏం చెప్పారంటే..?
హైదరాబాద్: వస్తుసేవల పన్ను(జీఎస్టీ)తో కార్పొరేట్ కంపెనీలతోపాటు సాధారణ జనాలకు కూడా లాభమేనని హేరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోడలు నారా బ్రాహ్మణి అన్నారు. శనివారం హైదరాబాద్ కస్టమ్స్ కార్యాలయంలో జరిగిన జీఎస్టీ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ.. జీఎస్టీ అమలవుతున్న దేశాల జాబితాలో భారతదేశం కూడా చేరిందని అన్నారు. అంతర్జాతీయ వ్యాపారాన్ని, ఈజ్ ఆఫ్ డూయింగ్ను ప్రోత్సహిస్తుందని ఆమె చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
జీఎస్టీ అమలులోకి రావడం శుభపరిణామమని బ్రాహ్మణి అన్నారు. జీఎస్టీ సేవా వివిధ రకాల పన్నులను రద్దుచేసి ఏకీకృత జీఎస్టీని కేంద్రం తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. జీఎస్టీతో వినియోగదారుడికి, వ్యాపార వర్గాలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మేలు జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రపంచంలో మూడో అతిపెద్ద మార్కెట్గా భారత్ అవతరించనుందని అపోలో ఆస్పత్రుల ఎండీ సంగీతారెడ్డి అభిప్రాయపడ్డారు. జీఎస్టీతో తగ్గిన ధరలను తక్షణమే తమ ఆస్పత్రుల్లో అమలుచేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్రంలో జీఎస్టీ అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు భట్నాగర్ తెలిపారు.
బషీర్బాగ్లోని కేంద్ర జీఎస్టీ, కస్టమ్స్ శాఖ ప్రధాన కార్యాలయంలో జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బ్రాహ్మణితోపాటు అపోలో ఆస్పత్రుల ఎండీ సంగీతారెడ్డి, జీఎస్టీ చీఫ్ కమిషనర్ సందీప్ ఎం.భట్నాగర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఎస్టీ వెబ్పోర్టల్ను చీఫ్ కమిషనర్ భట్నాగర్ ప్రారంభించారు. కేంద్రాల కోసం ముద్రించిన మార్గదర్శకాల సంచికను ఆవిష్కరించారు.
కాగా, శుక్రవారం అర్ధరాత్రి నుంచే జీఎస్టీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. జీఎస్టీ అమలుతో పలు వస్తువుల ధరల్లో తేడాలు రానున్నాయి. అయితే, జీఎస్టీ అమలు వల్ల సామాన్య జనాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.