ఏపీలో నూతన ఇసుక పాలసీ.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఇసుక విషయంలో ఎటువంటి అక్రమాలు, అవినీతికి అవకాశం లేని, ప్రజలకు ఇబ్బందులు కలిగించని పాలసీని తీసుకొస్తాం అన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ఇసుక లభ్యత, నూతన ఇసుక పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. సచివాలయంలో ఆయా శాఖల మంత్రులు, అధికారులతో నేడు సిఎం వరుస సమీక్షలు నిర్వహించారు.
ఇసుక పాలసీపై సమీక్ష చేసిన చంద్రబాబు
గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు ఇసుక పాలసీతో ఇబ్బంది పడ్డారని....ఇసుక సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దీనికి అవసరమైన రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సమస్యల తీవ్రత దృష్ట్యా తక్షణమే ఎలాంటి చర్యలు తీసుకోవాలి.....దీర్ఘకాలికంగా ఎటువంటి ప్రణాళికలు అమలు చేయాలి అనే విషయంపై నిర్థిష్టమైన విధానాలతో అధికారులు పనిచేయాలని సిఎం అన్నారు.

గత ప్రభుత్వ ఇసుక పాలసీపై అధికారుల నివేదిక
నేడు ఇసుక పాలసీపై సమీక్షలో భాగంగా రాష్ట్రంలో ఇసుక లభ్యత, నూతన ఇసుక పాలసీ ఏ విధంగా ఉండాలన్న దానిపై చంద్రబాబు సమీక్షించారు. 2014 నుంచి 2019 వరకు ఇసుక సరఫరాలో అమలు చేసిన పాలసీలను, ఆ తరువాత వైసీపీప్రభుత్వం తెచ్చిన విధానాలను అధికారులు వివరించారు.2016లో తెచ్చిన ఉచిత ఇసుక పాలసీ వల్ల వచ్చిన ఫలితాలు...తరువాత వచ్చిన వైసీపీప్రభుత్వం పాలసీలు మార్చడం వల్ల జరిగిన నష్టాన్ని సిఎం దృష్టికి తీసుకువెళ్ళారు.
నిర్మాణ రంగం సంక్షోభం గురించి చంద్రబాబుకు చెప్పిన అధికారులు
గత ప్రభుత్వ విధానాలతో ఇసుక కొరత, ధరల భారంతో నిర్మాణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొందని అధికారులు చంద్రబాబుకు వివరించారు. ఇసుక క్వారీల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం, ప్రైవేటు వ్యక్తులు, ఏజెన్సీలకు ఇసుక క్వారీలను అప్పగించడంతో సరఫరా, అమ్మకాల్లో ఇబ్బందులు వచ్చాయని అధికారులు తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో ఇసుక పాలసీ వల్ల అక్రమాలు
సీసీ కెమెరాలు, జీపీఎస్ ట్రాకింగ్, ఆన్ లైన్ విధానం సరిగా లేకపోవడం వల్ల అక్రమాలు జరిగాయని అధికారులు అన్నారు. ప్రైవేటు ఏజెన్సీలు ఎంత మేర తవ్వకాలు జరిపాయి. ఎంత మేర అమ్మకాలు జరిపాయనే విషయంలో కూడా నాడు ఎటువంటి పరిశీలన, పర్యవేక్షణ జరగలేదని తెలిపారు.
ఇసుక పాలసీపై చంద్రబాబు అధికారులకు ఆదేశం
దీంతో తక్షణం నిర్మాణ రంగానికి అత్యవసరమైన ఇసుకను అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా చూడాలని అన్నారు. ప్రస్తుతం స్టాక్ పాయింట్లలో అందుబాటులో ఉన్న ఇసుకను సరఫరా చేసేందుకు ఉన్న వెసులుబాటును చూడాలని సిఎం చంద్రబాబు ఆదేశించారు.
ప్రజలకు ఇబ్బంది లేని ఇసుక పాలసీ తెస్తాం
ఇసుక కొరత సమస్యను తీర్చడం, ధరలను నియంత్రించడంపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది లేని విధంగా నూతన ఇసుక పాలసీని రూపొందించాలన్నారు. దీని కోసం సమగ్ర సమాచారం, ప్లాన్ తో రావాలని అధికారులకు సూచించారు. నూతన పాలసీతో ప్రజలకు ఇసుక లభ్యత అవినీతికి తావు లేకుండా అందుతుందన్నారు.












Click it and Unblock the Notifications