ఈ ఏడైనా కరోనా తగ్గుతుందా లేదా? లక్ష డాలర్ల ప్రశ్న...తెలుగురాష్ట్రాల ప్రజల్లో భయం, భయం
2020 సంవత్సరానికి గుడ్ బై చెప్పాం .. 2021 సంవత్సరానికి వెల్కమ్ చెప్తున్నాం.. కానీ తెలుగురాష్ట్రాల ప్రజల మనసులో మాత్రం కరోనా వైరస్ తాలూకు ఆందోళన ఏ మాత్రం తగ్గలేదు. ఈ సంవత్సరమైనా కరోనా మహమ్మారి నుండి బయట పడతామా ? లేదా... లేక గత ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా ఇబ్బంది పడతామా? అన్న భయం ప్రజల్లో అలాగే ఉండిపోయింది. కారణం కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్.

కరోనా కొత్త స్ట్రెయిన్ పై సర్వత్రా ఆందోళన
కరోనా వైరస్ రూపాంతరం చెంది కొత్త స్ట్రెయిన్ లు గా మారుతున్న వేళ అందరిలోనూ ఒకటే ఆందోళన నెలకొంది. వ్యాక్సిన్ వచ్చినప్పటికీ, వ్యాక్సిన్ కరోనా కొత్త వైరస్ ల మీద పని చేస్తుందా ? వ్యాక్సిన్ వల్ల కరోనా నుంచి బయటపడగలుగుతామా ? అన్నది ప్రతి ఒక్కరిలోనూ ఆందోళనకు కారణమౌతుంది. గత ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా కరోనా చేతిలో చిక్కి విలవిలలాడాల్సిందే నా అన్న భయం ప్రజల్లో కనిపిస్తుంది. 2021 సంవత్సరానికి స్వాగతం చెబుతూ, ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నప్పటికీఈ ఏడాదైనా ఆరోగ్య సంక్షోభం నుంచి బయట పడతామా? లేదా అని అందరిలోనూ ఒకటే ఆందోళన.

కరోనా కట్టడి కోసం కేంద్రం తాజా మార్గదర్శకాల నేపధ్యంలో ప్రజల్లో అనుమానాలు
ఇప్పటికే భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుందని, ఇక యూకె నుండి వచ్చిన కొత్త స్ట్రెయిన్ కూడా ఆందోళన కలిగిస్తోందని అర్థమవుతోంది. ఈ క్రమంలో స్ట్రెయిన్ వైరస్ ను అడ్డుకునే చర్యల్లో భాగంగా అవసరమైతే రాత్రి కర్ఫ్యూ కూడా విధించవచ్చని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించడం ఎక్కువ మంది గుమికూడి కాకుండా పరిమితులు విధించుకోవచ్చని, ఇక మార్కెట్లను నిర్దేశిత సమయాలలోనే పని చేసేలా నిబంధనలు విధించవచ్చని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను రాష్ట్రాలకు పంపింది .

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి 31 వరకు కరోనా ఆంక్షలు
దీంతో ఈ యేడు కూడా కరోనా మహమ్మారి విషయంలో తొలి రోజు నుండే ఆందోళన నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి 31 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని కరోనా వైరస్ మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గురువారం ఉత్తర్వులు జారీ చేశారు .ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా మొదటి నెల కరోనా ఆంక్షలతో మొదలైంది . దీని నుండి ఈ ఏడు కూడా ఉపశమనం లేదా అన్న భావన ఏపీ వాసుల్లో వ్యక్తం అవుతుంది.
Recommended Video

నైరాశ్యంలో ప్రజలు .. జిల్లాలలో పెద్దగా లేని న్యూ ఇయర్ హడావిడి
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏ జిల్లాలోనూ పెద్దగా జరగలేదనే చెప్పాలి. కరోనా మహమ్మారి మిగిల్చిన నైరాశ్యం నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదని చెప్పాలి. ఇక కరోనా వ్యాక్సిన్ పైన కూడా అనేక అనుమానాలు ప్రజలలో వ్యక్తమవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దుష్ప్రభావాలు ఉంటున్నాయన్న ఊహాగానాలు నేపథ్యంలో చాలామంది వ్యాక్సిన్ తీసుకోవాలంటే భయపడుతున్న పరిస్థితి ఉంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ పేల్చిన బాంబు .. ఆందోళనతో ప్రారంభం అయిన 2021
ఇదే సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా మహమ్మారి చివరిది కాదని , మరింత తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాలు రాబోతున్నాయని ప్రకటించటం కూడా తీవ్ర ఆందోళనకు కారణంగా మారింది. ఇన్ని భయాలు, ఆందోళనల మధ్య కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ సంవత్సరమైనా కరోనా మహమ్మారి నుండి, అలాగే ఆరోగ్య సంక్షోభం నుంచి బయటపడితే బాగుంటుందని ఆలోచిస్తున్నారు . మొత్తానికి 2021ఆందోళనలో ప్రారంభమైనా ఆనందంగా ముగియాలని ఇప్పటి నుండే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications