బుచ్చయ్యతో ఫలించని టీడీపీ మంతనాలు-రాజీనామాపై కొనసాగుతున్న సస్పెన్స్
టీడీపీ అధిష్టానం వైఖరిపై అలిగి రాజీనామాకు సిద్ధమైన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయనతో వరుసగా రెండోరోజూ పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా సంప్రదింపులు జరిపినా ఆయన రాజీనామాపై మాత్రం వెనక్కి తగ్గలేదు.
పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్ వైఖరిపై ఆగ్రహంతో నిన్న రాజీనామా చేస్తానని ప్రకటించిన బుచ్చయ్య చౌదరితో ఇవాళ పార్టీ పంపిన త్రిసభ్యు బృందం సమావేశమైంది. పార్టీ నేతలు చినరాజప్ప, జవహర్, గద్దే రామ్మోహన్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయినా బుచ్చయ్య మాత్రం తన డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా త్వరలో జరిగే రాజమండ్రి కార్పోరేషన్ ఎన్నికల్లో తన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.
ఇవాళ కూడా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుచ్చయ్య చౌదరితో ఫోన్ లో మాట్లాడారు. బుచ్చయ్య డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు. పార్టీ అధిష్ఠానంతో చర్చించి పరిష్కరించుకుందామని ఆయనకు నచ్చచెప్పారు. అయినా బుచ్యయ్య మాత్రం తన పట్టు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పీఏసీ ఛైర్మన్ పదవితో పాటు తనకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం దక్కడం లేదని అసంతృప్తిగా ఉన్న బుచ్చయ్య.. రాజమండ్రి కార్పోరేషన్ ఎన్నికల్లోనూ తన అనుచరులకు ప్రాధాన్యం దక్కకపోతే రాజీనామా చేయడమే మేలనే నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ నెల 25న రాజీనామా చేస్తానని ప్రకటించిన బుచ్చయ్యను ఆ లోపు బుజ్జగించేందుకు టీడీపీ హైకమాండ్ ప్రయత్నిస్తోంది.
త్వరలో రాజమండ్రి కార్పోరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ కాస్తో కూస్తో బలంగా ఉందని భావిస్తున్న సిటీలో సత్తా చాటాలంటే బుచ్చయ్య చౌదరి అవసరం ఎంతో ఉందని టీడీపీ భావిస్తోంది. అలాంటి సమయంలో బుచ్చయ్య రాజీనామాస్త్రంతో పార్టీని ఇరుకునపెట్టారు. దీంతో ఆయన కోరిన విధంగా అనుచరులకు కార్పోరేషన్ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధిష్టానం నుంచి సందేశం వస్తేనే ఆయన పట్టువీడే అవకాశం కనిపిస్తోంది.