ఘాటెక్కిన ఉల్లి ధరలు ...టాప్ లేపుతున్న టమోటా: కూరగాయలు ధరలు మరింత ప్రియం ..కారణమిదే !!
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు, ఉల్లి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి. గత వారం వరకు కాస్త ఫర్వాలేదు అనిపించిన ధరలు ,ఒకేసారి కొండెక్కి కూర్చున్నాయి. సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. కిలో ఉల్లి ధర 20 రూపాయల నుంచి 50 రూపాయలకు చేరుకున్న పరిస్థితి ఉంది. ఇక టమోటా ధరలు 60 రూపాయల పైమాటే .. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
భారీ వర్షాల కారణంగా దెబ్బ తిన్న ఉల్లి పంట
భారీ వర్షాల కారణంగా నాసిక్, పూణే, అహ్మద్ నగర్ వంటి మరికొన్ని ఉల్లి సాగు చేసే ప్రాంతాలలో ఉల్లి పంట తీవ్రంగా దెబ్బతింది. ఫలితంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, బొగ్గు కొరత కారణంగా గూడ్స్ రైళ్లలో సరుకు రవాణాకు ఇబ్బంది ఏర్పడడం, వర్షాలు వరదలు ఇలా అనేక అంశాలు ఉల్లి ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. ఒక తెలుగు రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా పరిస్థితి ఇదే విధంగా ఉంది. మరికొద్ది రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశముందని తాజా పరిస్థితులను బట్టి తెలుస్తుంది.
తగ్గిన ఉల్లి దిగుమతి..హైదరాబాద్ మార్కెట్ లో 50 రూపాయల ఉల్లి ధర
దేశ వ్యాప్తంగా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుండి ఉల్లి దిగుమతి అవుతుంది కానీ వరదల కారణంగా ఉల్లి పంట దెబ్బ తినడంతో మార్కెట్లో ఉన్న డిమాండ్ ను తగినంతగా ఉల్లి గడ్డలు మార్కెట్లకు రావడం లేదు. గత వారం వరకు 20 రూపాయల నుంచి 25 రూపాయల వరకు విక్రయించిన దుకాణదారులు ప్రస్తుతం ఒక్కసారిగా ఉల్లి ధరలను 50 రూపాయలకు చేర్చారు.
ఇంకా ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక నిన్నమొన్నటి వరకు వంద రూపాయలకు మూడు నుంచి నాలుగు కిలోల వరకు ఇచ్చిన ఉల్లిగడ్డ తాజాగా రిటైల్ మార్కెట్లో కిలో 40 రూపాయల నుండి 50 రూపాయల వరకు పలుకుతుంది. వంద రూపాయలకు రెండు నుంచి రెండున్నర కిలోలు మాత్రమే ఉల్లిగడ్డలు వస్తున్న పరిస్థితి ఉంది.
డిసెంబర్ వరకు ఉల్లి కొరత ఉండే ప్రమాదం
ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే డిసెంబర్ నెల వరకు ఉల్లి కొరత తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఒక అంచనా. నాణ్యతను బట్టి నాసిక్ తో పాటు ఇతర జిల్లాల్లో ఉల్లిని క్వింటాలుకు రూ 2500 నుండి 3500 మధ్య వేలం వేస్తారు . రిటైల్ మార్కెట్లో ఉల్లిపాయ కిలో 50నుండి 60 రూపాయల వరకు విక్రయిస్తున్నారు.
మార్కెట్లోకి ఉల్లి సరైన సమయానికి రాకపోతే ధరలు మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణా రాష్ట్రాలలో ఇటీవల కురిసిన వర్షాలు వరదల కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని భావిస్తున్నారు.
మంట పుట్టిస్తున్న టమోటా .. మెట్రో నగరాల్లో టమోటా ధర 50 రూపాయల పైనే
ఇదిలా ఉంటే టమోటా ధరలు కూడా ఒక్కసారిగా విపరీతంగా పెరిగాయి. దేశంలోని మెట్రో నగరాల్లో టమోటా ధర 50 రూపాయలకు పైగానే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది .ఇక దేశంలోనే అత్యధికంగా కోల్కతాలో ధర 93 రూపాయలకు పైగా ఉంది. చెన్నైలో 60 రూపాయలు, ఢిల్లీలో 59 రూపాయలు, 53 రూపాయలు, ఇక తెలుగు రాష్ట్రాలలోనూ టమోట ధర 60 రూపాయలకు పైమాటే నడుస్తుంది.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు టమోటా ఉత్పత్తి జరుగుతుంది . అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పంట బాగా దెబ్బతింది. ఫలితంగా డిమాండ్ కు తగినంతగా టమోటా ఉత్పత్తి జరగడం లేదు. మార్కెట్లకు టమోటా పెద్దగా రావడం లేదు. దీంతో ఒక్కసారిగా టమోట ధరలు ఆకాశాన్నంటాయి.
హైదరాబాద్ మార్కెట్ లో భారీగా పడిపోయిన దిగుమతి .. రోజూ 80 లారీలు కూడా రాని టమోటా
ప్రపంచంలోనే టమోటా ఉత్పత్తిలో భారత దేశం రెండో స్థానంలో ఉంది. చైనా మొదటి స్థానంలో ఉంది. దేశంలో గరిష్టంగా టమోటో ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో ప్రస్తుతం దేశంలోనే టమోట సామాన్యులు కొనుగోలు చేయలేనంత ప్రియంగా మారింది. హైదరాబాద్ మార్కెట్ కు సాధారణ రోజుల్లో రోజుకు 150 నుంచి 180 లారీలు టమోటా దిగుమతి అవుతుంది కానీ ప్రస్తుతం పంట నష్టాల కారణంగా రోజుకు 80 లారీలు కూడా దిగుమతి కాని పరిస్థితి ఉంది. దీంతో ధరలు పెరుగుతున్నట్లుగా వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్ లో కిలో టమోట ధర 60 రూపాయల నుండి 70 రూపాయల వరకు
ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో హైదరాబాద్ లో నాణ్యత అంతంత మాత్రంగానే ఉన్న కిలో టమోట ధర 60 రూపాయల నుండి 70 రూపాయల వరకు పలుకుతోంది. మరో నెల రోజుల పాటు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ఒక్కసారిగా విపరీతంగా ధరలు పెరగడంతో సామాన్యులు ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదని లబోదిబోమంటున్నారు. ధరలను నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ధరల నియంత్రణపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి
ఇప్పటికే వంట నూనెల ధరలు చుక్కలను తాకాయి. నిత్యావసరాలు కూడా కొనుగోలు చెయ్యలేనంతగా పెరిగాయి. ఇప్పుడు ఉల్లి గడ్డలు, టమోటాలు కూడా కొనుగోలు చెయ్యలేనంతగా కంట నీరు తెప్పిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ధరల నియంత్రణకు దృష్టి సారించకుంటే సామాన్యుల జీవనం మరింత దుర్భరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.