'ఐస్ క్రీం' పార్టీకి పార్థసారిథి కౌంటర్, మంచిదే.. బాబుకు మెచ్చుకోలు
విజయవాడ: తమ పార్టీని ఐస్ క్రీంలా కరిగిపోయే పార్టీ అన్న ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి పార్థసారథి మంగళవారం నాడు కౌంటర్ ఇచ్చారు. అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన పథకాన్ని మెచ్చుకున్నారు.
ఆయన మాట్లాడుతూ... విభజన పాపం నేపథ్యంలో, ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిందన్నారు. అలాంటి పార్టీ తమ పైన విమర్శలు గుప్పించడం విడ్డూరమన్నారు. ఆ పార్టీకి తమను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. వారి వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు.
కృష్ణా - గోదావరి నదుల అనుసంధానం మంచిదేనని పార్థసారథి వ్యాఖ్యానించారు. అయితే, ఎడమ కాల్వ పైన లిఫ్ట్ ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. పోలవరానికి సమాధి కట్టేందుకేనా అని నిలదీశారు. దేవినేని ఉమామహేశ్వర రావు నిర్వర్తించే జలవనరలు శాఖ, ధనవరుల శాఖనా అని ఎద్దేవా చేశారు.

జగన్ ఉండటం దౌర్భాగ్యం: బొజ్జల
నదుల అనుసంధానం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశానికే ఆదర్శంగా నిలిచారని మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి అన్నారు. నదుల అనుసంధానం, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల పైన వైసిపి తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.
రాయలసీమలో, గోదావరి జిల్లాల్లో నదుల అనుసంధానంపై వైసిపి తప్పుడు ప్రచారం చేసిందన్నారు. మంచిని వ్యతిరేకించే వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యమని బొజ్జల అన్నారు. పట్టిసీమతో చంద్రబాబు గొప్ప నేతగా మిగిలారన్నారు.












Click it and Unblock the Notifications