గన్ లేదని, తరిమేసి.. ప్లాన్తో వైసిపి నేత హత్య, ముందే గుర్తించిన నారాయణరెడ్డి
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి ప్రత్యర్థులు పక్కా ప్లాన్తోనే హత్య చేశారని అంటున్నారు. ఈ ఘటనలో నారాయణ రెడ్డితో పాటు అనుచరుడు సాంబశివ రెడ్డి కూడా మృతి చెందారు.
కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి ప్రత్యర్థులు పక్కా ప్లాన్తోనే హత్య చేశారని అంటున్నారు. ఈ ఘటనలో నారాయణ రెడ్డితో పాటు అనుచరుడు సాంబశివ రెడ్డి కూడా మృతి చెందారు.
ఈ దారుణ హత్య కృష్ణగిరి రామకృష్ణాపురం వద్ద చోటు చేసుకుంది. నారాయణ రెడ్డి వెల్దుర్తి మండలంలోని కొసనాపల్లెలో కే సాక్షి హనుమంతు తనయుడు రమేష్ వివాహానికి హాజరయ్యారు. అనంతరం 11.30 గంటల ప్రాంతంలో కారులో స్వగ్రామానికి పయనమయ్యారు.
చదవండి: జగన్ పార్టీ ముఖ్య నేత దారుణ హత్య
ఆ సమయంలో ప్రత్యర్థులు కాపు కాసి, తొలుత ఆయన కారును ట్రాక్టరుతో ఢీకొట్టించి, అనంతరం బాంబులు, వేట కొడవళ్లతో దాడి చేసి చంపేశారు. ఎదురుగా మూడు ట్రాక్టర్లు పెట్టి చంపేశారు. నారాయణపై దాదాపు 15 నుంచి 20 మంది దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.
ట్రాక్టర్తో ఢీకొట్టి
నారాయణ రెడ్డి ఓ పెళ్లికి వెళ్లి వస్తుండగా కృష్ణగిరి వద్ద అడ్డుకొని ప్రత్యర్థులు హత్య చేశారు. ఓ కల్వర్ట్ వద్ద ట్రాక్టరుతో నారాయణ రెడ్డి వాహనాన్ని ఢీకొట్టారు. నారాయణ రెడ్డి ట్రాక్టరు నుంచి తప్పించుకొని వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో తొలుత బాంబులతో దాడి చేశారు. ఆ తర్వాత కత్తులు, వేట కొడవళ్లతో దాడికి పాల్పడ్డారు.
అనుచరులను తరిమేసి..
నారాయణ రెడ్డితో పాటు మృతి చెందిన సాంబశివా రెడ్డితో పాటు పలువురు వెంట ఉన్నారు. మరో వాహనంలో మరికొంతమంది నారాయణ రెడ్డి అనుచరులు ఫాలో అవుతున్నారు. కత్తులు, బాంబుల దాడితో అనుచరులను పారిపోయేలా చేశారని తెలుస్తోంది.
ఒంటరిగా..
అనుచరులు వెంట ఉంటే ఆయనను చంపడం కష్టమనో లేక నారాయణ రెడ్డిని ఒక్కరినే హత్య చేయాలనో ప్రత్యర్థులు భావించారని అంటున్నారు. అందుకో అనుచరులను పారిపోయేలా చేశారని భావిస్తున్నారు. ఆ తర్వాత నారాయణ రెడ్డిని కత్తులు, వేట కొడవళ్లతో దాడి చేశారు. అక్కడే ఉన్న అనుచరుడు సాంబశివా రెడ్డి కూడా హత్యకు గురయ్యాడు. అనుచరులను పారిపోయేలా చేసిన ప్రత్యర్థులు.. పారిపోకుండా అక్కడే ఉంటే చంపేయాలని భావించారని అంటున్నారు. అందుకే సాంబశివా రెడ్డి చనిపోయాడని భావిస్తున్నారు.
దాడి జరుగుతుందని ముందే గుర్తించి
నారాయణ రెడ్డి తనకు ప్రాణహానీ ఉందని ముందే గుర్తించారు. అందుకే పలుమార్లు పోలీసులకు, అధికార పార్టీకి తన భద్రత కోసం విన్నవించారని అంటున్నారు. తనకు ప్రాణహానీ ఉందని, భద్రత ఇవ్వాలని కోరారని వైసిపి అంటోంది. తనకు రక్షణ కల్పించాలని కోరినప్పటికీ ఆశించిన స్పందన రాలేదంటున్నారు. తనపై ప్రత్యర్థులు దాడి చేసే అవకాశముందని ఆయన ముందే చెప్పారంటున్నారు.
గన్ రెన్యూవల్కు ఇచ్చింది పసిగట్టి.. తిరగబడలేరని.. అదను చూసి
నారాయణ రెడ్డి వద్ద ఓ లైసెన్స్డ్ రివాల్వర్ ఉంది. ఇటీవల లైసెన్స్ రెన్యూవల్ కోసం దానిని డిపాజిట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆయన వద్ద రివాల్వల్ లేకుండా పోయింది. ఆయన వద్ద గన్ లేని విషయాన్ని కూడా ప్రత్యర్థులు గుర్తించారని, ఇలాంటి సమయంలో ఇక ఆయన తప్పించుకోలేరని, అలాగే తిరగబడలేరని భావించి అదను చూసి దాడి చేశారంటున్నారు.
బలం పెరుగుతున్న సమయంలో..
గత ఎన్నికల్లో నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిపై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసిపిలో చేరారు. ప్రజల్లోకి బాగా వెళ్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని అంటున్నారు. ఆయన క్రమంగా మరింత బలపడుతున్నారు. ఇలాంటి సమయంలో హత్యకు గురి కావడం గమనార్హం.