ప్రచారాల కోసమేనా చట్టాలు .. ఆడబిడ్డల రక్షణపై జగన్ సమాధానం చెప్పాలి : పవన్ కళ్యాణ్ డిమాండ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహిళల రక్షణ విషయంలో పదేపదే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. గతంలోనూ పలుమార్లు మహిళల రక్షణ విషయంలో, రాష్ట్రంలో జరుగుతున్న దారుణాల విషయంలో ఆందోళన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ తాజాగా ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన దళిత యువతి స్నేహలత మృతిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లాలో జరిగిన ఈ దారుణ హత్య పై ప్రభుత్వ తీరును ఎండగట్టిన పవన్ కళ్యాణ్ ప్రచారం కోసం చట్టాలు చేస్తే మహిళలకు రక్షణ దొరుకుతుందా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.

వ్యవస్థల వైఫల్యం స్నేహలత ప్రాణాలు తీసిందన్న పవన్ కళ్యాణ్
వ్యవస్థల వైఫల్యం స్నేహలత ప్రాణాలు తీసిందని పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. స్నేహలత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన పవన్ కళ్యాణ్, రాష్ట్రంలో జరుగుతున్న దారుణాల విషయంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరిని తప్పుబట్టారు.
మహిళల రక్షణ కోసం దిశ చట్టం చేశామని, నేరం చేసిన వారికి 21 రోజుల్లోనే శిక్ష పడుతుంది అంటూ ప్రచారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆచరణలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.

మహిళలపై దారుణాలు పెరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు
మైనర్ బాలికలు, విద్యార్థినులు ,మహిళలు, యువతులు ఇలా నిత్యం మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. ఉన్మాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నదంటూ, రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదంటూ మండిపడ్డారు. విజయవాడలో , గాజువాకలో పలు ఘటనల్లో మృగాళ్ల చేతిలో యువతులు బలైనా ప్రభుత్వం ఏమీ చేయలేక పోయిందని విరుచుకుపడ్డారు. ఇప్పుడు అనంతపురం జిల్లా ధర్మవరంలో స్నేహలత అనే పేద దళిత యువతి హత్యకు గురవడం అత్యంత బాధాకరమని తీవ్ర విచారం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.

ఈ దారుణాల విషయంలో సీఎం జగన్ , హోం మంత్రి సుచరిత సమాధానం చెప్పాలి
దిశా చట్టం చేశామని పాలాభిషేకాలు చేయించుకుని, కేకులు కోయించుకున్న ప్రభుత్వం చట్టాన్ని ఆచరణలోకి తీసుకురావడంలో విఫలమైందన్నారు. ఆడబిడ్డలపై పెట్రోల్ పోసి తగులబెట్టడాలు, కత్తులతో దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు రాష్ట్రంలో ఏ మాత్రం ఆగలేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు, హోంమంత్రి సుచరిత గారు ప్రచారం కోసం చేసిన ఈ చట్టం ఆడబిడ్డలకు ఏవిధంగా రక్షణ కనిపిస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నా, కఠిన చర్యలు తీసుకోకపోవడం దారుణమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications