కూటమి పేరు వాడేసుకుంటున్న డీఎస్పీ..! ఎస్పీకి పవన్ కళ్యాణ్ కీలక ఆదేశం..!
ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ పోలీసు అధికారిపై ఫైర్ అయ్యారు. అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా సివిల్ వివాదాల్లో తలదూర్చడం, కూటమి నేతల పేర్లు వాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తనకు వస్తున్న ఫిర్యాదులపై నేరుగా ఎస్పీకే ఫోన్ చేసిన పవన్ కళ్యాణ్..ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ఎస్పీకి పవన్ గుర్తుచేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. భీమవరం డీఎస్పీ పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయని, సివిల్ వివాదాలలో ఆయన జోక్యం చేసుకొంటున్నారని, పక్షపాత ధోరణి చూపిస్తున్నారని, కూటమి నేతల పేరు వాడుతున్నారనే ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి భీమవరం డీఎస్పీపై వచ్చిన ఫిర్యాదులపై ఇవాళ మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఈ అంశంపై ఉప ముఖమంత్రి పవన్ కల్యాణ్ ఫోన్ లో మాట్లాడారని జనసేన పార్టీ తెలిపింది. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులు ప్రస్తావించి డీఎస్పీ వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని ఆదేశించారు. అసాంఘిక వ్యవహారాలకు డీఎస్పీ స్థాయి అధికారి అండగా ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలని సూచించారు. అలాగే పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకుండా చూడాలన్నారు.

ఈ తరహా వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదనే విషయాన్ని పోలీసులకు తెలియజేయాలని పవన్ కళ్యాణ్ ఎస్పీని ఆదేశించారు. ప్రజలందరినీ సమదృష్టితో చూసి శాంతిభద్రతలను పరిరక్షించాలని సూచించారు. అక్కడితో ఆగకుండా భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి వంగలపూడి అనిత దృష్టికి, రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తా దృష్టికి తీసుకెళ్లాలని తన కార్యాలయ అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు.












Click it and Unblock the Notifications