Nara Lokesh : లోకేష్ పాదయాత్రకు అనుమతి -డీజీపీకి టీడీపీ రిమైండర్ !
ఏపీలో టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్రకు సిద్దమవుతున్నారు. ఈనెల 27న కుప్పం నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తన యువగళం పాదయాత్రకు అనుమతి కావాలని డీజీపీ, హోం సెక్రటరీతో పాటు స్ధానిక ఎస్పీల అనుమతి కోరారు. అసలే జీవో నంబర్ 1పై వివాదం రేగిన వేళ, హైకోర్టులో ఈ అంశం పెండింగ్ లో ఉండటంతో అనుమతిపై ఉత్కంఠ నెలకొంది.
ఈ నేపథ్యంలో నారా లోకేష్ పాదయాత్రకు అనుమతిపై డీజీపీని మరోసారి గుర్తుచేస్తూ టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఇవాళ లేఖ రాశారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర అనుమతులకు సంబంధించి నేటి వరకు ఎటువంటి స్పందన రాలేదంటూ డీజీపీకి రిమైండర్ వర్ల రామయ్య రిమైండర్ పంపారు. పాదయాత్ర తేది సమీపిస్తున్నప్పటికీ మీ వైపు నుంచి ఎటువంటి స్పందన లేదని అందులో ఆయన గుర్తుచేశారు. జనవరి 27న మొదలు కానున్న పాదయాత్రకు త్వరగా అనుమతులు ఇవ్వమని ఆయన కోరారు.
లోకేష్ పాదయాత్రకు పోలీసుల వైపు నుంచి అనుమతులు ఇస్తే అవసరమైన ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా ఉటుందని డీజీపీకి రాసిన లేఖలో వర్ల రామయ్య పేర్కొన్నారు. పాదయాత్రకు సంబంధించిన సమాచారం కొరకు పార్టీ నేత బీద రవిచంద్ర, లోకేష్ పీఏ నరేష్ లను సంప్రదించవచ్చని ఈ లేఖలో వర్ల కోరారు. దీనిపై డీజీపీ ఇప్పటివరకూ స్పందించలేదు. హైకోర్టులో జీవో నంబర్ 1పై ఈ నెల 23న విచారణ ఉంది. అందులో వెలువడే ఆదేశాలు ఈ పాదయాత్రకు కీలకంగా మారబోతున్నాయి. ఎందుకంటే రోడ్లపై ఎలాంటి యాత్రలు చేయకుండా ప్రభుత్వం ఈ జీవో జారీ చేసింది. దీంతో హైకోర్టు ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా ప్రభుత్వం లోకేష్ పాదయాత్రకు అనుమతిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఒకవేళ ప్రభుత్వం కాదంటే హైకోర్టును ఆశ్రయించేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు.