కొత్త జిల్లాల ఏర్పాటు పరిపాలనా సౌలభ్యం కోసమే, లోతైన అధ్యయనం చేశాం: ప్లానింగ్ సెక్రటరీ విజయ్ కుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందులలో చిక్కుకొని విలవిలలాడుతున్న సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటు అవసరమా అని కొందరు చర్చిస్తూ ఉంటే, పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం ఉత్తమమని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video

కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆసక్తికర విషయాలు చెప్పిన ప్లానింగ్ సెక్రటరీ
తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటు పై ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ ఆసక్తికర విషయాలను చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటు పై లోతైన అధ్యయనం జరిగిందని ఆయన వెల్లడించారు. జిల్లాల విభజన పై భారీ కసరత్తు చేశామని పార్లమెంటు నియోజకవర్గాలు ప్రకారం 25 జిల్లాలు కాకుండా భౌగోళిక పరిస్థితుల ఆధారంగా 26 జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించామని ఆయన తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ విభజన ప్రక్రియలో జిల్లా కేంద్రాలు, భౌగోళిక, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలను పరిగణలోకి తీసుకున్నామని వెల్లడించారు.

ప్రజల మనోభావాలను, చారిత్రక నేపథ్యాలను అధ్యయనం చేశాం
జన సాంద్రత, భౌగోళిక విస్తీర్ణం, ప్రాంతాల మధ్య దూరాన్ని, పరిపాలన సౌలభ్యం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని విభజన ప్రతిపాదన చేశామని విజయ్ కుమార్ వెల్లడించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా జిల్లాకు కనీసం రెండు రెవిన్యూ డివిజన్లు ఉండేలా, అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ఒకే జిల్లాలో ఉండేలా చూశామని విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రజల మనోభావాలను, చారిత్రక నేపథ్యాలను అధ్యయనం చేశామని విజయ్ కుమార్ వెల్లడించారు. కొత్త జిల్లాలకు సరిహద్దులపై కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రజల రవాణా సౌలభ్యాన్ని పరిశీలించామని పేర్కొన్నారు.

జిల్లాల పునర్విభజన ద్వారా ప్రాంతీయ అభివృద్ధి
వనరుల విషయంలో సమతుల్యతను పాటించామని తెలిపారు. జిల్లాల పునర్విభజన ద్వారా ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఇక వివిధ జిల్లాలలో జిల్లాల పునర్విభజన పేరుతో జరిగిన మార్పులు, చేర్పులపై వివరాలు చెప్పిన ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం ప్రాంతాలను మూడు జిల్లాలుగా ఏర్పాటు చేశామన్నారు. కోనసీమ ప్రాంతాన్ని జిల్లాగా చేయాలని అక్కడ ప్రజలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు, కాబట్టి అమలాపురం కేంద్రంగా దాన్ని ప్రతిపాదించామని వెల్లడించారు.

ఏజెన్సీలో ప్రజల అభివృద్ధి కోసం రెండు జిల్లాలు ఏర్పాటు
పెందుర్తిని తీసేస్తే అనకాపల్లి వెనుకబడే అవకాశం ఉందని విజయకుమార్ అభిప్రాయపడ్డారు పెందుర్తి ని అనకాపల్లిలోనే ఉంచామని పేర్కొన్నారు శ్రీకాకుళం పేరున్న ఇన్స్టిట్యూట్ లన్నీ ఎచ్చెర్ల లోనే ఉన్నాయని దీంతో ఎచ్చెర్ల శ్రీకాకుళం లోనే ఉంచామని విజయ్ కుమార్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజల అభివృద్ధి కోసం రెండు జిల్లాల ఏర్పాటు జరిగిందని ఆయన తెలిపారు. అందుకే రంపచోడవరం ప్రాంతాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేర్చామని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ వెల్లడించారు.

1979 తర్వాత జిల్లాల పునర్విభజన జరగలేదు .. భారీ కసరత్తు తర్వాతే కొత్త జిల్లాలు
విజయనగరం విస్తీర్ణం కోసమే రాజాంను జిల్లాలో కలిపినట్లుగా విజయ్ కుమార్ వెల్లడించారు. విజయనగరం అభివృద్ధి దెబ్బతినకుండా ఉండేలా చూశామని పేర్కొన్నారు. భీమిలి కి ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ఇక 1979వ సంవత్సరం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన జరగలేదని గుర్తు చేసిన విజయ్ కుమార్ జిల్లాల పునర్విభజన ద్వారా ప్రాంతీయ అభివృద్ధి దోహదపడుతుందని పేర్కొన్నారు. కొత్త జిల్లాలు అన్నింటిలో సుమారు 20 లక్షల చొప్పున జనాభా ఉందని ప్లానింగ్ సెక్రెటరీ విజయ్ కుమార్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications