ఏపీలో సీఎస్ ఆదేశాలూ బేఖాతర్.. తాడేపల్లిలో వలస కార్మికులపై విరిగిన లాఠీ...
గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉంటున్న వలసకూలీలపై మరోసారి లాఠీ విరిగింది. తమను వెంటనే స్వస్ధలాలకు పంపాలంటూ వలస కార్మికులు తాడేపల్లిలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వలస కార్మికులపై పోలీసులు లాఠీ ఝళిపించారు. దీంతో వారు భయంతో పరుగులు పెట్టారు. తాడేపల్లి జాతీయ రహదారిపై నుంచి పోలీసులు వారిని స్ధానికంగా ఉన్న ఇళ్లకు పంపారు. అయితే పోలీసులు వలస కార్మికులపై లాఠీ ప్రయోగం చేయడం వివాదాస్పదమైంది.
తిండి లేక రోజుల తరబడి ప్రయాణం: రైల్వేస్టేషన్లో బిస్కెట్ల కోసం వలస కార్మికుల కొట్లాట
నిన్న సాయంత్రం జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న కూలీలను అటుగా వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ గమనించి కారు దిగి వివరాలు తెలుసుకున్నారు.అనంతరం వారిని పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడి నుంచి స్వస్థలాలకు పంపించాలని అధికారులను ఆదేశించారు.దీంతో రహదారిపై వెళ్తున్న ఉత్తర్ప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వెయ్యి మంది వలస కూలీలను తాడేపల్లిలోని విజయవాడ క్లబ్కు తరలించారు.
వీరిలో కొంతమంది కాలినడకన వెళ్లేవారు, మరికొందరు సైకిళ్లపై వెళ్లేవారు ఉన్నారు.ఈరోజు ఉదయం పునరావాస కేంద్రంలో అల్పాహారం పంపిణీ చేస్తున్న క్రమంలో సైకిళ్లపై వచ్చిన కూలీలు కొందరు తిరుగు ప్రయాణమయ్యారు.సుమారు 150 మంది కూలీలు విజయవాడ కనకదుర్గమ్మ వారధి వద్దకు చేరుకోగానే పోలీసులు గుర్తించి అడ్డుకున్నారు.ఈక్రమంలో పోలీసులు లాఠీఛార్జి చేయడంతో కూలీలు భయంతో పరుగులు తీశారు.అనంతరం వారందరినీ విజయవాడ క్లబ్కు తీసుకొచ్చి వివరాలు నమోదు చేసుకుంటున్నారు.