ఏపీలో స్థానిక ఎన్నికలు..హీటెక్కిన రాజకీయాలు..పార్టీల వ్యూహాలు, ప్రతివ్యూహాలు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుండే కసరత్తు మొదలు పెట్టారు ప్రధాన పార్టీల నాయకులు . స్థానిక సంస్థల ఎన్నికలను వీలైనంత త్వరగా పూర్తిచేసేలా అందులోనూ మెజార్టీ స్థానాలు దక్కించుకునేలా కసరత్తు ముమ్మరం చేసింది వైసీపీ ప్రభుత్వం. ఎత్తులు, పై ఎత్తులు , వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో స్థానిక సమరానికి ఎవరికి వారు సన్నద్ధం అవుతున్నారు. దీంతో ఏపీలో రాజకీయం వేడెక్కింది.
ఏకకాలంలో స్థానిక పోరును నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదన
స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని, త్వరిత గతిన పూర్తి చెయ్యాలని భావించింది సర్కార్ . ఏకకాలంలో స్థానిక పోరును నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఎన్నికల కమిషనర్ ముందుంచింది అధికారుల బృందం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈనెల 21న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, 24న పురపాలక సంఘాలు, 27న గ్రామ పంచాయతీలకు ఎలక్షన్లు నిర్వహించాలన్న ప్రతిపాదనపై ఎన్నికల కమిషనర్తో అధికారులు చర్చించారు .
సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామన్న ఎన్నికల కమీషనర్
ఈ నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి చేస్తే 14వ ఆర్థిక సంఘం నిధులు వచ్చే అవకాశం ఉంటుందని లేదంటే కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుందని అధికారులు ఎన్నికల కమీషనర్ దృష్టికి తీసుకెళ్ళారు. అయితే సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయిస్తామని ఎన్నికల కమీషనర్ చెప్పారు. ఇక వీలైనంత త్వరగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి వివరాలు అందజేస్తామని ఉన్నతాధికారుల బృందం కమిషనర్కు తెలిపింది.
మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తున్న వైసీపీ
ఇక వైసీపీ ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. ఈసారి జరగనున్న ఎన్నికలు వైసీపీ పాలనకు ప్రజల ఆమోదం ఎలా ఉందో తెలిపే కీలక ఎన్నికలుగా భావిస్తున్న వైసీపీ పకడ్బందీగా ఎన్నికల కసరత్తులు మొదలుపెట్టింది. మంత్రులు,ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించి మెజార్టీ స్థానాలు దక్కించుకునేలా వ్యూహాలు సిద్ధం చేస్తుంది. సీఎం జగన్ గత అసెంబ్లీ ఎన్నికల్లో చూపించిన హవా మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చూపించాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రతిపక్ష టీడీపీని దెబ్బ కొట్టే స్కెచ్ వేస్తున్నారు.
బీసీ రిజర్వేషన్ లపై పోరాటానికి దిగిన టీడీపీ
ఇక రిజర్వేషన్లపై ఎటూ తేల్చకుండా , బీసీలకు అన్యాయం చేసి ఎన్నికలకు వెళ్తామని వైసీపీ ప్రభుత్వం చెప్తున్న దానిపై టీడీపీ పోరాటానికి సిద్ధం అవుతుంది. సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఇక హైకోర్టు రిజర్వేషన్లు 50శాతానికి మించకుండా ఉండాలని సూచించటంతో ఆ మేరకు రిజర్వేషన్లను తగ్గిస్తున్నారు .అయితే అందులో బీసీలకు అన్యాయం జరిగిందని రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24శాతానికి తగ్గించడం దారుణం అని భావించిన టీడీపీ ప్రభుత్వం తీరుకు నిరసనగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
సుప్రీం కోర్టులో పిటీషన్ వేసిన టీడీపీ
అటు న్యాయపోరాటం, ఇటు ప్రజా పోరాటం ఉధృతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు . జీవో 558 ద్వారా జగన్ ప్రభుత్వం బీసీల గొంతు కోసిందని మండిపడ్డారు చంద్రబాబు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించడాన్ని సవాల్ చేస్తూసుప్రీం కోర్టును ఆశ్రయించారు . బీసీ రిజర్వేషన్ల కుదింపు నిర్ణయం సీఎం జగన్ కనుసన్నల్లో జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఒకపక్క ఎన్నికల కసరత్తులు చేస్తూనే మరోపక్క వైసీపీని టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతుంది టీడీపీ.
Recommended Video
ఎన్నికలకు సిద్ధం అవుతున్న బీజేపీ, జనసేనలు
ఇక బీజేపీ కూడా ఎన్నికలకు సిద్ధం అవుతుంది. నిన్న స్థానిక సంస్థల ఎన్నికలు అజెండా గా భేటీ అయిన బీజేపీ నాయకులు క్షేత్ర స్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని నిర్ణయించారు. జనసేనతో పొత్తు కారణంగా అనుసరించాల్సిన వ్యూహంపై కూడా సమాలోచనలు జరిపారు. మోడీ పాలన, కేంద్రం అమలు చేస్తున్న పధకాలు గ్రామాలలో ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు తొమ్మిది నెలల జగన్మోహన్ రెడ్డి పాలనలో వైఫల్యాలు, పెన్షన్ ల రద్దు వంటి అంశాలను ప్రజలకు వివరించాలని, స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపుకు అవకాశం ఉన్న గ్రామాల పై ప్రత్యేక దృష్టి సారించాలని కన్నా సూచించారు. ఇలా ఎవరికి వారు వ్యూహాలతో ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు.