పోసాని కృష్ణ మురళి ఇంటిపై దాడి వైసీపీ పనే.. దాడి వెనుక ప్రశాంత్ కిషోర్ టీమ్ ఉందన్న జనసేన
పవన్ కళ్యాణ్ వర్సెస్ పోసాని కృష్ణ మురళి రగడ కొనసాగుతూనే ఉంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇంటిపై బుధవారం అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు రాళ్లతో దాడి చేసిన ఘటన మరోమారు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. నిన్న అర్ధరాత్రి సమయంలో పోసాని కృష్ణమురళి ఇంటిపై ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళ్లి రాళ్ళు రువ్వినట్టు పోలీసులకు పోసాని కృష్ణ మురళి ఇంటి సూపర్ వైజర్ పురుషోత్తం ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లోని అమీర్ పేట ఎల్లారెడ్డి గుడాలోని పోసాని ఇంటి పైన రాళ్ల దాడి చేసిన ఘటనలో పోసాని కృష్ణ మురళి ఇంట్లో పని చేస్తున్న ఇద్దరికి ప్రమాదం తప్పిందని ఆయన పేర్కొన్నారు.
పవన్ పై వ్యాఖ్యలతో పోసానికి వార్నింగ్ ఇచ్చిన జనసేన నేతలు
గత కొంతకాలంగా పోసాని కృష్ణ మురళి ఆ ఇంట్లో నివసించటం లేదు. బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అసభ్య పదజాలంతో దూషిస్తూ ఇంట్లోకి రాళ్లు వేరని ఫిర్యాదులో పేర్కొన్నారు. సూపర్ వైజర్ ఫిర్యాదు మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోసాని కృష్ణ మురళి ఇంటి సమీపంలోని సిసి టివి కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇటీవల పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసేన పార్టీ నేతలు పోసాని కృష్ణ మురళికి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
పోసాని ఇంటిపై దాడి, జనసేనపై ఆరోపణలు .. ఖండించిన జనసేన నేత
పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న క్రమంలో కూడా ఆయన ప్రెస్ మీట్ ను అడ్డుకోవడానికి జనసేన పార్టీ నేతలు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోసాని కృష్ణమురళి ఇంటిపై దాడికి పాల్పడిన వారు జనసేన పార్టీ కి సంబంధించిన వారేనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పోసాని కృష్ణమురళి ఇంటిపై జరిగిన దాడికి జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని జనసేన పార్టీ నాయకుడు, తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ స్పష్టం చేశారు. పోసాని ఇంటిపై దాడికి తమ పార్టీకి సంబంధం లేదని చెప్పిన ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నే పోసాని కృష్ణమురళి ఇంటిపై దాడి చేయించి జనసేనపై దాడి రుద్దే కుట్ర చేస్తోంది అంటూ ధ్వజమెత్తారు.
వైసీపీ దాడులకు పాల్పడే అవకాశం ఉందని ముందే చెప్పామన్న జనసేన.. పీకే టీమ్ పై అనుమానం
ఈ వ్యవహారాన్ని కావాలనే వైసీపీ పెంచుతోందని అంటున్నారు. తాము రెండు రోజుల క్రితమే ఈ తరహా దారులు జరిగే అవకాశం ఉందనే విషయం చెప్పామని స్పష్టం చేశారు .ఇప్పుడు అదే జరిగిందని కిరణ్ రాయల్ పేర్కొన్నారు. పోసాని కృష్ణ మురళితో వైసీపీనే బూతులు మాట్లాడేస్తోంది అని, ఇక ప్రస్తుతం జరుగుతున్న అనేక పరిణామాల వెనుక ప్రశాంత్ కిషోర్ టీమ్ వుందని ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేసిన జనసేన పార్టీ పోసాని కృష్ణ మురళిపై దాడి చేసి తమ మీద రుద్దే ప్రయత్నం కూడా చేస్తారంటూ వైసీపీపై ఇంతకుముందే విమర్శలు గుప్పించారు.
ఈ క్రమంలోనే తాజాగా జనసేన పార్టీ పై కుట్రలో భాగంగా వైసీపీ పోసాని కృష్ణ మురళి ఇంటి పై రాళ్ల దాడి చేయించినట్లుగా వారు ఆరోపిస్తున్నారు. వైసీపీ అరాచకాలు ప్రజలకు తెలుసనీ, త్వరలోనే బుద్ధి చెప్తారని అంటున్నారు.