Raghurama Krishna Raju: రఘురామకు హైకోర్టులో షాక్..! పోలీసులకు కీలక ఆదేశాలు..!
ఏపీలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు (Raghurama krishna Raju)కు ఎదురుదెబ్బ తగిలింది. గతంలో రఘురామ కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్న ఇండ్ భారత్ పవర్ జెన్ కామ్ లిమిటెడ్ సంస్థ దివాలా తీసింది. దీంతో జాతీయ లా ట్రైబ్యునల్ నిర్వహించిన వేలం ప్రక్రియలో దీన్ని అగతా ఎనర్టీ, ఇన్ ఫ్రాస్టక్చర్ సంస్థ 101.42 కోట్లకు దక్కించుకుంది. నిబంధనల ప్రకారం రఘురామ కుటుంబ సభ్యుల నుంచి దీనికి సంబంధించిన సొమ్ము వసూలు చేసుకునేందుకు కొత్త సంస్థకు అవకాశం ఉంది.
అయితే ఈ సొమ్ము కట్టకుండా, పాత ఫైళ్లు ఇవ్వకుండా రఘురామ తన మనుషుల్ని పంపి బెదిరింపులకు దిగుతున్నారని అగతా ఎనర్జీ సంస్ద ఛైర్మన్, డైరెక్టర్ మాదల శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు రఘురామకు వ్యతిరేకంగా కేసు తీసుకునేందుకు నిరాకరిస్తూ వస్తున్నారు. దీంతో మాదల శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. గుంటూరులోని తన ఇంట్లోకి రఘురామ పంపిన మనుషులు అక్రమంగా ప్రవేశించి తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని, తనకు అమ్మిన కంపెనీకి సంబంధించిన ఫైళ్లు, రికవరీ అప్పీల్లను సైతం వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో మాదల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చింది.

మాదల శ్రీనివాస్ పై బెదిరింపులకు దిగిన వ్యవహారంలో రఘరామ కృష్ణరాజుకు వ్యతిరేకంగా ఆధారాలు లభిస్తే చట్టప్రకారం కేసు నమోదు చేయాలని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తగిన ఆధారాలు ఉంటే కేసు నమోదు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు తమకు పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసుల్ని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. మరోవైపు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో మాదల శ్రీనివాస్.. తనకు రఘురామకృష్ణ రాజు నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు 2 ప్లస్ 2 పోలీసుల భద్రత కల్పించాలని కూడా కోరారు. దీనిపై తదుపరి విచారణలో హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications