RRR: ఉండిలో రికార్డు మెజార్టీతో రఘురామ గెలుపు ! స్పీకర్ అవుతారా ?
ఏపీలో ఇవాళ వెలువడుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఉండి నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసిన కనుమూరు రఘురామకృష్ణంరాజు భారీ మెజార్టీతో విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన ఆయన ఉండిలో ఎదురైన ముక్కోణపు పోటీలో ఏకంగా 56 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచారు.
టీడీపీ రెబెల్ అభ్యర్ధి శివరామరాజు బరిలో ఉన్నప్పటికీ రఘురామ విజయాన్ని అడ్డుకోలేకపోయారు. దీంతో రఘురామ కొత్త ప్రభుత్వంలో పోషించబోయే పాత్రపై చర్చ జరుగుతోంది.

ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మంతెన రామరాజును కాదని చివరి నిమిషంలో రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇచ్చారు. నరసాపురం ఎంపీ టికెట్ కోసం చివరి నిమిషం వరకూ పోటీ పడిన రఘురామకు బీజేపీ ఝలక్ ఇచ్చింది. దీంతో ఆయన తప్పనిసరి పరిస్దితుల్లో చంద్రబాబు ఇచ్చిన ఉండి ఆఫర్ తీసుకున్నారు. అయితే అక్కడ అప్పటికే టికెట్ దక్కలేదనే అసంతృప్తితో ఉన్న శివరామరాజు (కలవపూడి శివ) తో పాటు వైసీపీ అభ్యర్ధి పీవీఎల్ రాజు నుంచి గట్టి పోటీ ఎదురైంది.
అయితే ఎన్నికల రాజకీయాల్లో ఛాంపియన్ అయిన రఘురామరాజు.. తన సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. అప్పటికే వైసీపీ ప్రభుత్వం రఘురామను టార్గెట్ చేసి ఐదేళ్లు ఇబ్బంది పెట్టడంతో ఆ సానుభూతి కూడా కలిసి వచ్చింది. దీంతో రెబెల్ శివరామరాజు 13 వేల ఓట్లు చీల్చినా రఘుురామ 56 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. వాస్తవానికి రఘురామ తాజాగా మాట్లాడుతూ తన మెజార్టీ 18 వేలని పందాలు కాస్తున్నారని, కానీ తాను 30 వేలు వస్తుందని ఊహిస్తున్నట్లు తెలిపారు. కానీ ఇప్పుడు ఆయన అంచనాలకు మించి 56 వేల రికార్డు మెజార్టీ సాధించారు.
మరోవైపు వైసీపీ బాధితుడిగా ఒకప్పుడు ఇబ్బందులు పడ్డ రఘురామరాజును అసెంబ్లీలో స్పీకర్ గా చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా జగన్ అసెంబ్లీకి ప్రతిపక్ష నేతగా వస్తే స్పీకర్ ఉంటూ రఘురామ వేసే సెటైర్లు చూడాలనే ఆయన అభిమానుల కోరికను చంద్రబాబు నెరవేరుస్తారో లేదో చూడాలి మరి.












Click it and Unblock the Notifications