YS Jagan బెయిల్ రద్దుకు కారణాలివిగో-సీబీఐ కోర్టులో రఘురామ- షాకింగ్ రీజన్స్
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్కు గతంలో మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ వేసిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈ కేసులో గతంలో జగన్ దాఖలు చేసిన కౌంటర్కు స్పందించారు. మరింత ఘాటుగా రీజాయిండర్ దాఖలు చేశారు. ఇందులో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలన్నీ ప్రస్తావించారు. ఇందులో తన కేసుల్లో సహనిందితులకు చేసిన మేలు, సాక్ష్యుల్ని బెదిరించేందుకు ఎంచుకున్న మార్గాలు..అంతిమంగా బెయిల్ షరతులన్నీ ఉల్లంఘిచారని కోర్టు దృష్టికి తెచ్చారు.

జగన్ కౌంటర్కు రఘురామ రీజాయిండర్
సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దు పిటిషన్ వేసిన రఘురామృష్ణంరాజు ఇప్పుడు మరో రీజాయిండర్ దాఖలు చేశారు. జగన్ కౌంటర్కు ఎన్కౌంటర్గా దాఖలైన ఈ రీజాయిండర్లో జగన్ బెయిల్ రద్దు చేయడానికి అవసరమైన అన్ని కారణాల్నీ రఘురామ ప్రస్తావించారు. ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమాస్తుల కేసులో తన సహనిందితులకు చేసిన మేలుతో పాటు సాక్ష్యుల్ని బెదిరించేందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా చేసిన ప్రయత్నాలను కోర్టు దృష్టికి తెచ్చారు. జగన్ బెయిల్ రద్దుకు ఈ కారణాలు సరిపోతాయన్నారు.

జగన్ బెయిల్తో బాధితుడిగా రఘురామ
జగన్ బెయిల్ రద్దుకు తాను పిటిషన్ దాఖలు చేయడంపై వ్యక్తమైన అభ్యంతరాలకు రఘురామ ఇవాళ వివరణ ఇచ్చారు. ఇందులో జగన్ బెయిల్ రద్దుకూ, తనకూ సంబంధం లేదనడాన్ని తప్పుబట్టారు.2000లో సుప్రీంకోర్టు ఆర్ రతినం వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం బాధితుడు కూడా పిటిషన్ దాఖలు చేయొచ్చన్నారు. తద్వారా జగన్ బెయిల్తో తానూ బాధితుడిగా మారినట్లు రఘురామ చెప్పుకున్నట్లయింది. తాను షరతులు ఉల్లంఘించి పిటిషనర్పై కేసుల్ని అసందర్భంగా తెరపైకి తెస్తున్నారని,
చట్టపరమైన నిబంధనల ప్రకారమే నేను జగన్ బెయిల్ రద్దు కోరానని రఘురామ పేర్కొన్నారు.

నాపై ఎఫ్ఐఆర్లే, జగన్పై ఛార్జిషీట్ల సంగతేంటి ?
తనపై జగన్ చేసిన ఆరోపణల్లో పేర్కొన్న కేసుల్లో ఎఫ్ఐఆర్లు మాత్రమే దాఖలయ్యాయని, ఛార్జిషీట్లు దాఖలు కాలేదని రఘురామ తెలిపారు. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ల ప్రకారం చూసుకుంటే జగన్ కేసుల్లో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లలో ఆర్ధిక అక్రమాలు, ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం, ప్రజల ఆస్తుల్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోవడం వంటి తీవ్ర అభియోగాలు ఉన్నాయని రఘురామ గుర్తుచేశారు. కాబట్టి పిటిషనర్ అయిన తనపై జగన్ చేసిన ఆరోపణలు ఈ బెయిల్ రద్దు పిటిషన్కు సంబంధం లేనివని పేర్కొన్నారు. జగన్ కోరినట్లుగా తాను ఈ కేసును సంచలనం కోసం, ప్రచారం కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం దాఖలు చేశానన్న ఆరోపణల్ని తిరస్కరించాలని రఘురామ సీబీఐ కోర్టును కోరారు. తనపై జగన్ చేసిన ఆరోపణలన్నీ నిజమైనా పిటిషనర్ విచారణకు అవన్నీ అడ్డంకి కావని కోర్టు దృష్టికి తెచ్చారు. పిటిషన్లో తాను దాఖలు చేసిన అంశాలు కోర్టు ధిక్కారమని భావిస్తే జగన్ వాటిపై చర్యలు తీసుకోవచ్చని కూడా రఘురామ సూచించారు.

జగన్ది చిల్లర ప్రచారం
రాజకీయ కుట్ర, ప్రచారంలో భాగంగానే తాను ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు జగన్ చేసిన ఆరోపణల్ని సైతం రఘురామ తప్పుబట్టారు. ఇదంతా చిల్లర ప్రచారంలో భాగమేనన్నారు. జగన్ ఆరోపణలు నిజమైతే వాటిని రుజువు చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు.
తనపై సీఐడీ దాఖలు చేసిన రాజద్రోహం కేసులో అరెస్టు, తదనంతర పరిణామాల్ని ప్రస్తావించిన రఘురామ, అనంతరం తనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇందులో సీఐడీ తనను కస్టడీలో వేధించిందన్నారు. పిటిషనర్ అధికార దుర్వినియోగం, పోలీసుల సాయంతో విమర్శించే వారిని అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడినట్లు రుజువైందన్నారు. అలాగే సీబీఐ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుందని చెప్పారని, కానీ అందులో అధికారులు దర్యాప్తును ఎలా నిర్వీర్యం చేస్తున్నారో గమనించాలని సీబీఐ కోర్టును కోరారు. సీబీఐ అధికారుల విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా ఉందని, అందుకే వారు తన పిటిషన్లో ఉన్న అంశాల్ని పరిశీలించకుండానే ఏ నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. అందుకే ప్రాసిక్యూషన్ కూడా ఎలాంటి ఫిర్యాదులూ చేయడం లేదన్నారు. జగన్ బెయిల్ రద్దును సీబీఐ ఎందుకుకోరడం లేదో అందరికీ తెలుసన్నారు.

సహనిందితులకు జగన్ సాయం
సీఎం జగన్ చర్యలు అక్రమాస్తుల కేసులో సీబీఐ దర్యాప్తుకు ఆటంకం కలిగించేలా ఉన్నాయని, సహ నిందితులకు సాయం చేసేలా ఉన్నాయని రఘురామరాజు ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, కలెక్టర్ మురళీధర్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వంటి వారికి జగన్ ఏ విధంగా మేలు చేశారో రఘురామ తన రీజాయిండర్లో వివరించారు. అలాగే మరో సహ నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్ను సెర్బియా నుంచి విడిపించే విషయంలో హోంమంత్రి అమిత్షా వద్దకు పార్టీ నేతల్ని పంపారని తెలిపారు. అరబిందో ఫార్మా కేసులో సహనిందితుడికి కాకినాడ సెజ్ అప్పగించారన్నారు. హెటిరో ఫార్మాకేసులో సహనిందితుడికి వైజాగ్ బే పార్క్ అప్పగించారన్నారు.
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగాఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగతి పబ్లికేషన్స్కు భారీ ఎత్తున అక్రమంగా ప్రకటనలు ఇవ్వడం ద్వారా ఆర్ధిక లబ్ది చేకూరుస్తున్నారన్నారు.

సాక్షులకు బెదిరింపులు
గతంలో హైకోర్టు జడ్డిలు, సుప్రీంకోర్టు జడ్డి తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని సీజేకి లేఖ రాసి దాన్ని బహిరంగపరిచి వ్యవస్ధల ప్రతిష్ట దిగజార్చారరని రఘురామ ఆరోపించారు. చివరికి సీజే వాటిని తప్పుడు ఆరోపణలుగా తేల్చితిరస్కరించారన్నారు.
అఖిల భారత సర్వీసుల అధికారుల వార్షిక పనితీరు నివేదికల్ని పరిశీలించేందుకు తనను తాను రివ్యూ అధారిటీగా ప్రకటించుకోవడాన్నీ రఘురామ ప్రస్తావించారు. ఇది తన కేసుల్లో సాక్షులుగా ఉన్న సీనియర్ అధికారుల్ని బెదిరించేందుకేనన్నారు. ఇది బెయిల్ నిబంధనల్ని ఉల్లంఘించడమేనన్నారు. తన కేసుల్లో సాక్షిగా ఉన్న మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ విషయంల జగన్తో పాటు మంత్రులు చేసిన ఆరోపణలు, వ్యవహారశైలిని కూడా ఆధారంగా చూపారు.గతంలో విపక్ష నేతగా ఉన్నప్పుడు దాఖలైన కేసులన్నింటినీ అధికారంలోకి రాగానే జగన్ ఉపసంహరింపజేసుకున్నారని గుర్తుచేశారు. మీడియాలో తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే కథనాలపై న్యాయపరమైన చర్యలు తీసుకునే అధికారాన్ని కార్యదర్శులకు అప్పగిస్తూ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఈ చర్యలన్నీ గమనిస్తే తనకు బెయిల్ ద్వారా లబించిన స్వేచ్ఛను తన కేసుల్లో సాక్ష్యాల్ని రూపుమాపేందుకు వాడుకుంటున్నట్లు సాక్ష్యుల్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు రుజువైందన్నారు. తన ప్రభుత్వంలో ఉన్న సాక్ష్యుల్ని పరోక్షంగా బెదిరిస్తున్నట్లు తేలిందన్నారు. జగన్ బెయిల్ ఇచ్చిన సందర్భంగా విధించిన షరతుల ఉల్లంఘనకు పాల్పడ్డారని, బెయిల్ రద్దు చేసేందుకు ఈ కారణాలు సరిపోతాయన్నారు. తన కేసుల్లో సహనిందితులకు అపరిమితమైన మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆరోపించారు.
కాబట్టి బెయిల్ రద్దుపై తన అభ్యర్దనను ఆమోదించాలని కోరారు.












Click it and Unblock the Notifications