టీటీడీ హుండీల్లోఒక్క రూపాయి కూడా వెయ్యకండి..అది మీకు మంచిది కాదు ..సంచలన వ్యాఖ్యలు చేసిన దీక్షితులు
రమణ దీక్షితులు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ ప్రధాన అర్చకులుగా పని చేసిన రమణ దీక్షితులను ప్రధానార్చక పదవి నుంచి తొలగించడం, ఆ తర్వాత రమణదీక్షితులు టీటీడీ పాలకమండలి పై ఆరోపణలు చేయడం, శ్రీవారి ఆలయానికి సంబంధించి పలు సంచలన వ్యాఖ్యలు రమణదీక్షితులు చేయడం పెద్ద దుమారమే రేపింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి సంచలన ఆరోపణలు చేసిన రమణ దీక్షితులు ఆ ఎపిసోడ్ తరువాత తాజాగా తిరుమల శ్రీవారి హుండీలో డబ్బులు వేయాల్సిన అవసరం లేదు అని, ఒక్క రూపాయి కూడా ఎవరూ హుండీలో వేయొద్దని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వైసీపీ లో చేరగానే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన జీవితా రాజశేఖర్
రమణ దీక్షితులు శ్రీవారి హుండీ ఆదాయంపై చేసిన వ్యాఖ్యలు
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రధానార్చకుడిగా ఎన్నో ఏళ్ల పాటు స్వామివారి సేవలు చేసిన రమణ దీక్షితులు శ్రీవారి హుండీ పై చేసిన సంచలన వ్యాఖ్యలు అందరినీ షాక్ కి గురి చేశాయి. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఒక వీడియో లో రమణ దీక్షితులు స్వామివారి హుండీలో ఎవరు డబ్బులు వేయాల్సిన అవసరం లేదని ఒక్క రూపాయి కూడా వేయకండి అంటూ సంచలనం సృష్టించారు. అందుకు ఆయన చెప్పిన కారణం వింటే ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురవుతారు.
స్వామి వారికి హుండీలో ఒక్క రూపాయి కూడా వెయ్యొద్దు అన్న రమణ దీక్షితులు
అదేంటంటే స్వామివారికి రోజుకు రెండున్నర కోట్ల నుండి మూడు కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తోంది కానీ ఒక్క రూపాయి కూడా స్వామి వారి సేవలకు వినియోగించడం లేదు. స్వామి వారి సేవలకు సంబంధించిన ప్రతి ఒక్క అవసరాలను నేటి వరకు డోనర్స్ తీరుస్తున్నారు. ప్రతి నిత్యం స్వామివారి సేవకు వినియోగించే పుష్పాలు, వస్త్రాలు, అలంకరణలు, పచ్చ కర్పూరం, కస్తూరి దగ్గరనుండి ప్రతి ఒక్కటి దాతలు అందిస్తున్నారు. అంతేకాదు స్వామి వారికి సంబంధించిన ఉత్సవాలు అన్నిటినీ నిర్వహించడానికి దాతలే సహకరిస్తున్నారు.
ఒక్క రూపాయి స్వామి సేవకు వాడటం లేదు .. హుండీ ఆదాయం దుర్వినియోగం అవుతుందన్న రమణ దీక్షితులు
ఇక స్వామి వారి హుండీ లో వేసిన డబ్బులు ఏమవుతున్నాయో చెప్పిన రమణ దీక్షితులు చాలా ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. స్వామివారికి హుండీలో వేసిన డబ్బులు దుర్వినియోగం అవుతున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. ఆ డబ్బులను ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు, ఇంజనీరింగ్ పనులకు, ధర్మప్రచారానికి వినియోగిస్తున్నట్లు గా పేర్కొన్న రమణ దీక్షితులు ఆ డబ్బులు చాలావరకు దుర్వినియోగం అవుతున్నట్టుగా తెలిపారు. ఇక అంతటితో ఊరుకోక హుండీలో డబ్బులు ఇలా దుర్వినియోగమవుతున్నాయి కాబట్టి భక్తులెవరూ హుండీలో రూపాయి కూడా వేయకండి అంటూ రమణ దీక్షితులు తెలిపినట్లుగా ఆ వీడియోలో ఉంది.
జీర్ణావస్థకు చేరిన ఆలయాలకు విరాళాలు ఇవ్వమని సూచన .. తెలుగురాష్ట్రాల్లో రమణ దీక్షితుల వ్యాఖ్యలపై చర్చ
ఇక స్వామికి సేవ చేయాలనుకున్నవారు ధూపదీపాలకు నోచుకోని ఆలయాలలో పూజల కోసం కోసం, అర్చకుల జీతాల కోసం, జీర్ణావస్థకు చేరుకున్న ఆలయాల ఉద్ధరణ కోసం వినియోగించాలని కోరారు. అలాంటి దేవాలయాల్లో విరాళం ఇస్తే అవి స్వామికి నేరుగా చేరుతాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా పుణ్యం కూడా వస్తుందని చెప్పిన రమణ దీక్షితులు స్వామి వారి ఆలయంలోని హుండీలో డబ్బులు వేస్తే ఆ డబ్బు పాపకార్యాలకు దుర్వినియోగం అవుతుంది కాబట్టి అది మీకు మంచిది కాదు అంటూ సదరు వీడియో ద్వారా తెలిపారు. ఎన్నికల సమయంలో వైరల్ అవుతున్న రమణదీక్షితులు వీడియో తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ప్రస్తుతం పెద్ద చర్చ జరుగుతోంది.