ఒక్క సంవత్సరం అవి ఆపి.. ఏపీకి ఇవ్వండి.. తెలుగోడంటే?: శివాజీ ఉద్వేగం
విజయవాడ: ప్రత్యేక హోదా అంశంపై ఏపీలో ఉద్యమకారులంతా రగిలిపోతున్నారు. రాజకీయ పార్టీల నాన్చుడు ధోరణిపై వారు తీవ్ర అసహనంతో ఉన్నారు. పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక హోదా సాధన సమితి ద్వారా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్దమవుతున్నారు. చలసాని శ్రీనివాస్ నేత్రుత్వం వహిస్తున్న ఈ సమితిలో హీరో శివాజీ కూడా ఉన్నారు. అయితే ఈ సమితి బీజేపీపై చేస్తున్న ఆరోపణలు ఇప్పుడా పార్టీకి కంటగింపుగా మారాయి. టీవి9 నిర్వహించిన ఓ చర్చా వేదికలో తీవ్ర గందరగోళం సృష్టించేదాకా వెళ్లాయి.

శివాజీతో బీజేపీ ఘర్షణ:
చర్చా వేదికలో శివాజీ మాట్లాడుతున్న సందర్భంగా.. ఆయన ప్రసంగానికి బీజేపీ నేతలు అడ్డుపడే ప్రయత్నం చేశారు. దీంతో శివాజీ 'జీరో మోడీ.. జీరో మోడీ..' అంటూ నినాదాలు చేయడంతో వారి ఆవేశం మరింత కట్టలు తెంచుకుంది. శివాజీ వద్దకు వచ్చి ఘర్షణకు యత్నించడంతో చర్చా కార్యక్రమం కాస్త రసాభాసగా మారింది.
Recommended Video


మోడీకి ఎందుకు కొట్టాలి జిందాబాద్?:
బీజేపీ నేతలు దాడికి యత్నిస్తున్న సమయంలో.. 'మిమ్నల్ని ఇంకా ఇక్కడికి పిలిచి మాట్లాడనిస్తున్నారు నయం' అంటూ ఆ పార్టీ నేతలను ఉద్దేశించి శివాజీ కామెంట్ చేశారు. బీజేపిని ఎందుకు విమర్శించకూడదని, రాష్ట్రానికి ఏమి ఇవ్వనందుకు ఆ పార్టీకి జిందాబాద్ కొట్టాలా? అని శివాజీ ప్రశ్నించారు. తనలా ప్రశ్నించే ప్రతీ తెలుగువాడిని ఇదే విధంగా బెదిరిస్తారా?.. దాడి చేస్తారా? అంటూ నిలదీశారు.

గుర్తుంచుకోండి.. చంపుతారా?..:
'నా మీద జరిగే దాడి తెలుగువాడి మీద జరిగే దాడిగా గుర్తుంచుకోండి. ఏం చేస్తారు?.. చంపుతారా?.. అంతా ఒక్క తాటి పైకి వస్తానంటే నేను ప్రాణ త్యాగానికైనా సిద్దం. బీజేపీ కోసం కుక్కలా తిరిగి ఓటు అడిగాను. ఆరోజు మీరెవరూ లేరు. ఇప్పుడొచ్చారు మీరంతా. దాడి చేయండి.. నన్ను చంపండి. కానీ నా చావు కోసమైనా తెలుగువాళ్లు తిరగబడి ఏకమవుతారు. నాలాంటి వాళ్లు వందలమంది పుట్టుకొస్తారు' అని శివాజీ ఘాటుగా స్పందించారు.

ఏంటీ 'బీజేపీ' సంస్కృతి:
బీజేపీలో ఇదివరకు ఎన్నడూ ఈ సంస్కృతి లేదని, కొత్తగా ఇలాంటి దాన్ని తీసుకొచ్చారా? అని శివాజీ ఫైర్ అయ్యారు. తన మీద ఎగబడినంత మాత్రానా వెనక్కి తగ్గే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. శివాజీ ధీటుగా బదులివ్వడంతో.. ఆయనకు వ్యతిరేకంగా 'శివాజీ డౌన్.. శివాజీ డౌన్..' అంటూ నినాదాలు చేశారు బీజేపీ కార్యకర్తలు.
చర్చను నిర్వహిస్తున్న యాంకర్ మురళీ కృష్ట.. సంయమనం కోల్పోవద్దని, అర్థవంతమైన చర్చ జరుపుకుందామని పదేపదే చెప్పినా.. చాలాసేపటికి కానీ గొడవ సద్దుమణగలేదు.

పార్టీలు తర్వాత.. అలుసైపోతాం..:
ఎవరూ మాట్లాడితే వాళ్లను కొడుతారా.. చంపేస్తారా.. ఈ ఉద్యమం మొదలుపెట్టింది కేవలం ప్రాంతీయ సమస్యలకోసం. ఏ పార్టీ అనేది తర్వాత.. సమస్యలు పరిష్కారమయ్యాక ఎవడి పార్టీలు వాడు పెట్టుకుందాం.
ఇలాగే గొడవలు పెట్టుకుంటే కేంద్రం ముందు అలుసైపోతాం. తమిళనాడులో ఏదైనా సమస్య వస్తే పార్టీల సంగతి తర్వాత చూసుకుంటారు. మనం కూడా అలా ముందుకు వెళ్దాం.. అని శివాజీ పిలుపునిచ్చారు.

తెలుగోడంటే?..:
గదుల్లో కూర్చుని ఉద్యమాలు చేస్తే చరిత్రలో సక్సెస్ అయిన దాఖలు లేవు. పోరాటంతోనే విశాఖ ఉక్కును సాధించుకున్నాం. పోరాటంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలుగోడంటే ఎవరు?.. ఒక పీవీ, ఒక ఎన్టీఆర్, ఒక వైఎస్, ఒక చంద్రబాబు నాయుడు.. ప్రపంచంలో 8శాతం జనాభా ఉన్న జాతి మనది. కాబట్టి అందరం కలిసి పోరాడుదాం..

ఒక్క సంవత్సరం అవి ఆపండి..:
నాలుగేళ్లుగా సినిమాలు మానేసి కూర్చున్నా.బీజేపీలో ఉంటే బ్రహ్మండగా నెత్తిన పెట్టుకునేవాళ్లు. ఎన్నికలప్పుడు మోడీకి జిందాబాద్ ఎవరు కొట్టలేదు చెప్పండి. లక్ష కోట్ల రూపాయల హైదరాబాద్ వదిలేసుకుని వచ్చాం. 50వేల కోట్లకు మించి ఇప్పుడు ఆదాయం లేదు.
గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ ఇస్తున్నారు.. మంచిదే. కానీ ఒక్క సంవత్సరం అవి ఆపండి.. ఆ డబ్బులు ఏపీకి ఇవ్వండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి 3500కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒక్క సంవత్సరం ఆపండి.. ఆ డబ్బులు ఏపీకి ఇవ్వండి. అని శివాజీ విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications