మరో వైసీపీ కేసు కెలికిన ఏబీ వెంకటేశ్వరరావు..! ఈసారి ఎవరో తెలుసా ?
ఏపీలో గతంలో టీడీపీ ప్రభుత్వంలో నిఘా విభాగాధిపతిగా పనిచేసి, అనంతరం వైసీపీ ప్రభుత్వానికి టార్గెట్ అయి రెండుసార్లు సస్పెండ్ అయిన ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు అనంతరం క్లీన్ చిట్ తెచ్చుకున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వంలో కీలక పదవులు ఆశించిన ఆయనకు నిరాశ ఎదురుకావడంతో స్వయంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి వైసీపీని టార్గెట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదే క్రమంలో గతంలో వైసీపీ హయాంలో తెరపైకి వచ్చిన కేసుల్ని ఒక్కొక్కటిగా టచ్ చేస్తున్నారు.
ఇప్పటికే జగన్ కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న బాధితుడు జనిపల్లి శ్రీనివాసరావు కుటుంబాన్ని కలిసి సాయం చేస్తానని హామీ ఇచ్చిన ఏబీ వెంకటేశ్వరరావు ఇవాళ కాకినాడ వెళ్లి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన డ్రైవర్ వీధి సుబ్రమణ్యం కుటుంబాన్ని కలిశారు. అనంతరం వారితో కలిసి ఎస్పీ వద్దకు వెళ్లి ఈ కేసు పునర్ విచారణ చేయాలని కోరారు. గత ప్రభుత్వ బాధితుల పక్షాన అవసరం అయితే ప్రభుత్వ పెద్దలను కలుస్తానని ఏబీ తెలిపారు. వారు స్పందించకపోతే ఆందోళన చేస్తానని వెల్లడించారు.

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసులను ద్వారంపూడి మెనేజ్ చేశారని ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు.
ద్వారంపూడి బియ్యం కేసులో పురోగతి లభించడం లేదన్నారు.వీధి సుబ్రహ్మణ్యం హత్య అత్యంత నీచమైనదని ఆయన తెలిపారు. అనంత బాబుని కాపాడడానికి గత ప్రభుత్వం ఎన్నో అడ్డ దారులు తొక్కిందన్నారు. దర్యాప్తును తూతూ మంత్రంగా చేశారన్నారు. హంతకుడిని ఎలా బయటకు తీసుకురావాలనే చార్జిషీట్ వేశారన్నారు. ముద్దాయి చెప్పిన స్టోరీనే చార్జీ షీట్ లో పెట్టారన్నారు. పాలకుల కనుసన్నల్లో పోలీసులు చార్జీ షీట్ వేశారని ఆరోపించారు. ఏం చేసినా చెల్లుంతుందనే విధంగా జగన్ వ్యవహరించాడని ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు.












Click it and Unblock the Notifications