పవన్ కళ్యాణ్ కు రోజా సవాల్; లోకేష్ అసెంబ్లీలో అడుగుపెట్టలేరంటూ రోజా షాకింగ్ కామెంట్స్
ఏపీలో 10వ తరగతి పరీక్షల ఫలితాలపై రచ్చ కొనసాగుతున్న నేపధ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు మరోమారు మాటల యుద్ధానికి తెరతీశాయి. ఒకరిని మించి ఒకరు సవాళ్లు, ప్రతి సవాళ్ళతో రాజకీయ వేడి పుట్టిస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి రోజా సెల్వమణి పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబులపై విరుచుకు పడ్డారు. రోజా ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న తర్వాత రోజా మీడియాతో మాట్లాడారు. ఏపీలో రాజకీయ పరిణామాలపై రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును, లోకేష్ ను తూర్పారబట్టిన రోజా పవన్ కళ్యాణ్ పైనా నిప్పులు చెరిగారు.

జీవితంలో లోకేష్ అసెంబ్లీలో అడుగుపెట్టలేరన్న రోజా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం బాగా సాగుతుందని, ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని రోజా వెల్లడించారు. ఇక 10వ తరగతి ఫలితాలపై టీడీపీ రాజకీయం చెయ్యటం దిగజారుడుతనమని రోజా విమర్శలు గుప్పించారు. జూమ్ మీటింగ్ లో కొడాలి నాని, వల్లభనేని వంశీ వస్తే లోకేష్ ఎందుకు పారిపోయాడో చెప్పాలని మంత్రి రోజా ప్రశ్నించారు. ఇక జీవితంలో లోకేష్ అసెంబ్లీలో అడుగుపెట్టలేరని రోజా స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలైతే టీడీపీని మూసేస్తామని అచ్చెన్నాయుడు పదే పదే చెప్తున్నారని, అందుకు రెడీ అవ్వాలన్నారు రోజా.

పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ఎందుకు ప్రారంభిస్తున్నాడో చెప్పాలి
2019 నుండి రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికలలో టీడీపీ ఓటమి పాలవుతుందని మంత్రి రోజా వెల్లడించారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన మంత్రి రోజా పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ఎందుకు ప్రారంభిస్తున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టింది ఎవరి కోసమో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. కేవలం చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తున్నాడని, ఆయన పాకులాటకు కారణం అదేనని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలన్న రోజా
పవన్ కళ్యాణ్ కు దమ్ము, ధైర్యం ఉంటే గత టీడీపీ మ్యానిఫెస్టో, అలాగే వైసీపీ మ్యానిఫెస్టో తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలని రోజా సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్, లోకేష్ లు విసిరే సవాళ్ళకు మేమే ఎక్కువ, సీఎం జగన్ ఎందుకు వస్తారని రోజా ప్రశ్నించారు. తాము ఎక్కడికైనా చర్చ చెయ్యటానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రోజా పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, లోకేష్ లకు చర్చకు వచ్చే దమ్ము లేదని రోజా వ్యాఖ్యానించారు.

మీడియా పైనా రోజా ఆగ్రహం
అంతేకాదు మీడియా పైన కూడా రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించినట్టు వస్తున్న వార్తలపై మండిపడిన రోజా తనపై కావాలని కొన్ని మీడియా చానళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారని రోజా మండిపడ్డారు. తానూ, తన సిబ్బంది ఎప్పుడూ ఆలయ నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకోలేదని రోజా స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications