సూట్ కేసులతో రాలేదు, పరువునష్టం దావా: గాలికి రోజా సవాల్
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గాలికి మతిభ్రమించినట్లుందని విమర్శించారు. సోమవారం స్థానిక పంచాయతీరాజ్ అతిథిగృహంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
మాజీ కలెక్టర్ సిద్ధార్థజైన్తో కలిసి హంద్రీనీవా ప్రాజెక్ట్ అలైన్మెంట్ మార్చానని ఎమ్మెల్సీ గాలి చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు. ఆరోపణలకు ఆధారాలను బహిర్గతం చేయాలని రోజా డిమాండ్ చేశారు. లేకపోతే ముద్దుకృష్ణమనాయుడుపై పరువునష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు.
ఆ రికార్డులుండవు..
ఇటీవల ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ.. తన నిజాయితీ గురించి అసెంబ్లీ రికార్డులను పరిశీలించాలని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని రోజా అన్నారు. అసెంబ్లీ రికార్డుల్లో ప్రజాసమస్యలపై మాట్లాడిన విషయాలు ఉంటాయి గానీ, నీతి నిజాయితీలు రికార్డులు ఉండవన్నారు.
సూట్ కేసు చేతిలో పట్టుకుని రాలేదు
తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా సుమారు 150 సినిమాల్లో నటించి నిజాయితీగా డబ్బు సంపాదించానని వాఖ్యానించారు. ఎమ్మెల్సీ గాలి లాగా లెక్చరర్ ఉద్యోగం చేస్తూ సూట్ కేసు చేతిలో పట్టుకుని రాజకీయాల్లోకి వచ్చి కోట్లాది రూపాయలు సంపాదించలేదన్నారు.
ధన దాహమే కారణం
ముద్దుకృష్ణమనాయుడు తిరుమల దర్శనం టికెట్లు కూడా అమ్ముకునే వ్యక్తి అని రోజా ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ తన లేఖలపైన రోజుకు ఎంతమందికి దర్శనం టిక్కెట్లు ఇప్పిస్తున్నారనే విషయాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రూ.45 కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన పుత్తూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వాకింగ్ ట్రాక్గా మారిపోవడానికి ఎమ్మెల్సీ ధనదాహమే కారణమని రోజా మండిపడ్డారు.
రోజా సవాల్
పుత్తూరుపట్టణంలోని సదాశివేశ్వరస్వామి కోనేరు స్థలంలోని దుకాణాల అద్దె భగవంతుడికి చెందాల్సి ఉండగా, ఎమ్మెల్సీ అనుచరులు దోచుకుంటున్నారని రోజా ఆరోపించారు. వడమాలపేట టోల్ప్లాజా నిర్వాహకులు సక్రమంగా రోడ్డు నిర్మించకపోయినా ఫీజులు వసూలు చేస్తున్నారని, ఇందుకుగాను ఎమ్మెల్సీకి తిరుపతిలో ఇళ్లు నిర్మించి గిఫ్ట్గా ఇచ్చారని అన్నారు. ఎమ్మెల్సీ, ఆయన కుమారుడి అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని రోజా సవాల్ విసిరారు.
పాత స్టాండ్ వద్ద దుకాణాల లీజు పేరుతో మున్సిపల్ స్థలాలను టీడీపీ నాయకులకు అప్పనంగా దోచిపెట్టడాన్ని ఆమె తీవ్రంగా ఆక్షేపించారు. దుకాణాలను తొలగించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించైనా తొలగిస్తామని ఆమె హెచ్చరించారు.