వాయిస్ బాబుదా, కాదా: నిలదీసిన జగన్, సభకు దూరంగా చంద్రబాబు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో బయటకు వచ్చిన ఆడియో టేపులోని వాయిస్ మీదా, కాదా చెప్పాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. ఓటుకు నోటు కేసుపై శాసనసభలో తక్షణ చర్చ జరగాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పట్టుబడుతూ సభా కార్యక్రమాలను అడ్డుకుంది. సభ ఓసారి వాయిదా పడి తిరిగి సమావేశమైన తర్వాత జగన్ మాట్లాడారు.
జగన్ మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు పదే పదే ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అయినా జగన్ మాట్లాడుతూ వెళ్లారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి స్టీఫన్ సన్ వద్దకు రేవంత్ రెడ్డిని పంపించింది చంద్రబాబా, కాదా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దొంగతనం చేసి పట్టుపడిన విషయాన్ని మాట్లాడితే రెండు రాష్ట్రాల సమస్యగా చంద్రబాబు సృష్టిస్తున్నారని ఆయన అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తనతో మాట్లాడినట్లు రుజువు చేస్తే తాను రాజీనామా చేస్తానని, రుజువు చేయలేకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని జగన్ సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు కెసిఆర్తో పొత్తు పెట్టుకోలేదా అని ఆయన అడిగారు. ఓటు నోటు కేసులో చంద్రబాబు వాయిసేనని ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు నిర్ధారించిందని, ఎసిబి దాఖలు చేసిన చార్జిషీట్లో చంద్రబాబు పేరు 22 సార్లు ఉందని ఆయన చెప్పారు.
తనపైనే కాకుండా మరణించిన తన తండ్రిపై కూడా శాసనసభలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, నోటుకు ఓటు కేసులో పట్టుబడిన విషయాన్ని ప్రస్తావిస్తే తనపై వ్యక్తిగత దాడికి దిగుతున్నారని జగన్ అన్నారు. విషయాన్ని తప్పు దోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.
ఓటుకు నోటు కేసుపై మాట్లాడే ఆర్హత, నైతికత జగన్మోహన్ రెడ్డికి లేదని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి అన్నారు. జగన్లాంటి అతి పెద్ద అవినీతిపరుడు ప్రపంచంలో మరొకరు లేరని ఆయన అన్నారు. అక్రమాలకు అవినీతికి జగన్ కేంద్ర బిందువు అని ఆయన ఆరోపించారు.
గందరగోళం మధ్యనే టిడిపి సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించడం లేదని, టిఆర్ఎస్ ప్రతినిధిలా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అస్థిరంపాలు చేయాలనే కుట్రలో భాగంగానే జగన్ టిఆర్ఎస్తో కుమ్మక్కయ్యారని ఆయన అన్నారు. సభ సద్దుమణగకపోవడంతో స్పీకర్ మరోసారి పది నిమిషాల పాటు వాయిదా వేశారు.