ప్రభుత్వం నాలుగుమెట్లు దిగడానికి సిద్ధంగా ఉంది; మీరు మా శత్రువులు కాదన్న సజ్జల రామకృష్ణారెడ్డి
పిఆర్సి విషయంలో ఉద్యోగులతో చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఉద్యోగులతో చర్చల కోసం తాము ఎదురు చూశామని, ఉద్యోగులు తమకు శత్రువులు కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎక్కడో కూర్చుని మాట్లాడితే సమస్యకు పరిష్కారం రాదని ఆయన తెలిపారు.

చర్చలకు పిలిచినా రాకపోవటం దురదృష్టకరం
ఉద్యోగులను పిలిచి చర్చల కోసం ఎదురు చూసినా వాళ్లు రాకపోవడం దురదృష్టకరమైన విషయమని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. గురువారం ఏపీ సచివాలయంలో మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి టీవీ చానల్స్ లో కూర్చొని చర్చలు పెడితే సమస్య పరిష్కారం కాదన్నారు. సమ్మెకు వెళ్లడం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చట్టవిరుద్ధమని కోర్టులు చెప్పాయని వెల్లడించారు. తాము గత రెండు రోజులుగా ఉద్యోగులతో చర్చలు జరపడం కోసం ఆహ్వానిస్తూనే ఉన్నామని, ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఉద్యోగుల కోసం తాము ఎదురు చూశామని పేర్కొన్నారు.

ఉద్యోగ సంఘాలకు చెందిన వారు ఎవరొచ్చినా చర్చిస్తామన్న సజ్జల
వ్యక్తిగతంగా కూడా ఉద్యోగులను రమ్మని పిలిచామని పేర్కొన్న ఆయన చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి అంటూ తేల్చి చెప్పారు. రేపటి నుంచి కూడా తాము అందుబాటులో ఉంటామని, ఉద్యోగ సంఘాలకు చెందిన వారు ఎవరొచ్చినా చర్చిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిస్థితి సమ్మె వరకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. పిఆర్సి సాధన సమితి నేతలే కాదు మిగిలిన ఉద్యోగ సంఘాల నేతలు ఎవరు వచ్చినా తాము చర్చిస్తామని, చర్చలకు రమ్మని తాము కోరుతున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వం నాలుగు మెట్లు దిగడానికి సిద్ధంగా ఉంది
బాధ్యత కలిగిన నేతలు, మెచ్యూరిటీ లేకుండా వ్యవహరించడం మంచిది కాదని సజ్జల రామకృష్ణా రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నాలుగు మెట్లు దిగడానికి సిద్ధంగానే ఉందని, అయినప్పటికీ ఉద్యోగులు మొండి పట్టుదలతో వ్యవహరించడం బాధాకరమన్నారు. అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం సరికాదని, రెచ్చగొట్టే మాటలు తాము పట్టించుకోబోమని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఒంటెద్దు పోకడలకు పోవద్దని విజ్ఞప్తి చేస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.

ఉద్యోగులు తమకు శత్రువులు కాదన్న సజ్జల
ప్రభుత్వ ఉద్యోగులు తమ శత్రువులు కాదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పరిస్థితి చేజారిపోక ముందే చర్చలకు రావాలని సూచించారు. చర్చలకు రాకుండా షరతులు పెట్టడం సమంజసం కాదని సజ్జల రామకృష్ణా రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. చర్చలు మినహా ప్రత్యామ్నాయ మార్గం ఏదీ లేదని సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగులకు హితవు పలికారు.
Recommended Video

చర్చలకు వెళ్లాల్సిందిగా ఉద్యోగ సంఘాల నేతలకు ఉద్యోగులైనా చెప్పాలి
పే స్లిప్పులు వస్తే ఎవరికి ఎంత పెరిగిందో ఎవరికి ఎంత తగ్గిందో స్పష్టంగా తెలుస్తుందని పేర్కొన్నారు. సీఎం జగన్ రాష్ట్ర ఉద్యోగుల పట్ల ఎంతో పాజిటివ్ గా ఉండే వ్యక్తి అని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. చర్చలకు వెళ్లాల్సిందిగా ఉద్యోగ సంఘాల నేతలకు ఉద్యోగులైనా చెప్పాలని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులు లేఖ ఇచ్చిన రోజు ఈ నెల 27వ తేదీన మరోసారి చర్చ చేద్దామని చెప్పామని కానీ చర్చలకు ఉద్యోగ సంఘాల నేతలే రాలేదని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications