ఏపీ కొత్త సీఎస్ గా జవహర్ రెడ్డి-సీఎంవోలోకి పూనం, ప్రవీణ్ ప్రకాష్ కు కీలక బాధ్యతలు-బదిలీలు ఇవే
ఏపీలో సీనియర్ ఐఏఎస్ అధికారి, వైసీపీ ప్రభుత్వానికి అత్యంత విధేయుడిగా పేరు తెచ్చుకున్న జవహర్ రెడ్డిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఇవాళ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సీఎస్ గా ఉన్న సమీర్ శర్మ పదవీకాలం రేపటి నుంచి పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో జవహర్ రెడ్డి రేపు సాయంత్రం ఆయన నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు.
1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జవహర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు విభజన తర్వాత కూడా ఏపీలో పలు హోదాల్లో పనిచేశారు. సమర్ధుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో వైఎస్ కుటుంబ విధేయుడిగా కూడా ముద్రపడ్డారు. వివిధ జిల్లాల్లో కలెక్టర్ గా, ప్రభుత్వంలో పలు శాఖల్లో కార్యదర్శిగా ఆయన పనిచేశారు. టీటీడీలోనూ పలు హోదాల్లో పనిచేసిన జవహర్ రెడ్డి.. వైసీపీ ప్రభుత్వ హయాంలో వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శిగా వ్యవహరించారు. తాజాగా సీఎం జగన్ వద్ద ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శిగా జవహర్ రెడ్డి పనిచేస్తున్నారు.
వాస్తవానికి ప్రస్తుతం సీఎస్గా ఉన్న సమీర్ శర్మ తరువాత సీనియారిటీలో నీరభ్ కుమార్ ప్రసాద్, గిరిధర్, పూనం మాలకొండయ్య, కరికాల వలవన్ ఉన్నారు. వీరితో పాటు 1988 బ్యాచ్కు చెందిన మరో ఐఏఎస్ శ్రీలక్ష్మి పేరు కూడా ఓ దశలో వినిపించింది. అయితే వివిధ కారణాలతో సీఎం జగన్ కొత్త సీఎస్ గా జవహర్ రెడ్డిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సీనియార్టీ ప్రకారం సీఎస్ పదవికి ఎంపికలు చేయడం ఎప్పుడో మానేశారు. ఈ నేపథ్యంలో జవహర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చినా ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలగలేదు. ఇవాళ ప్రభుత్వం అధికారికంగా జవహర్ రెడ్డిని సీఎస్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
జవహర్ రెడ్డికి రెండేళ్లకు పైగా పదవీకాలం ఉండటంతో 2024 ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభుత్వానికి ఆయన అండగా ఉంటే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే సీఎం జగన్ ఆయన్ను ఎంచుకుని ఉండొచ్చని తెలుస్తోంది. మిగతా వారితో పోలిస్తే జగన్ కు విధేయుడు కావడం, సీనియర్ కూడా కావడంతో ఎన్నికల సమయంలో ప్రభుత్వానికి అనుకూలంగా తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో జవహర్ రెడ్డి కీలకంగా మారబోతున్నారు.
మరోవైపు జవహర్ రెడ్డిని సీఎస్ గా నియమించిన రోజే ప్రభుత్వం రాష్ఠ్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. సీఎస్ గా అవకాశం దక్కుతుందని భావించిన సీనియర్ ఐఏఎస్ పూనం మాలకొండయ్యకు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ)లో స్పెషల్ గా సీఎస్ గా అవకాశం కల్పించింది. ఆమె స్ధానంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా మధుసూదన రెడ్డిని నియమించింది. ఆ శాఖ కమిషనర్ గా రాహుల్ పాండేకు అవకాశమిచ్చారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్ ను నియమించిన ప్రభుత్వం..రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రద్యుమ్నను నియమించింది. ప్రస్తుతం పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా బుడితి రాజశేఖర్ ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.