శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కనబడుట లేదు.. పోస్టర్లు వేసిన గుంజేపల్లి గ్రామస్తులు
ప్రజల ఓట్లతో గెలిచి ప్రజా సంక్షేమం కోసం పని చేయాల్సిన ప్రజా ప్రతినిధులు తమ విధులను విస్మరిస్తే అప్పుడు ప్రజలు ఏం చేస్తారు? కొందరైతే సదరు ప్రజా ప్రతినిధులు వచ్చిన సమయంలో తమ నిరసనను తెలియజేస్తారు. మరికొందరు లోలోపల తిట్టుకుంటూ తమ అసహనాన్ని వెళ్లగక్కుతారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంజేపల్లి గ్రామం లోని ప్రజలు వేగంగా తమ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ ఆచూకీ చెప్పాలంటూ వినూత్న శైలిలో తమదైన నిరసనను తెలియజేశారు.

ఎమ్మెల్యే కనిపించటం లేదని పోస్టర్లు
శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కనిపించడం లేదంటూ గుంజేపల్లి ప్రజలు ఏకంగా గ్రామంలో పోస్టర్లు వేశారు. తమ ప్రాంత ఎమ్మెల్యే తమ సమస్యలను పట్టించుకోకపోవటం పట్ల వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆమె కనిపించడం లేదని, ఆమె ఆచూకీ తెలపాలంటూ గ్రామంలో పోస్టర్లు వేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పద్మావతి ఫోటోతో తమ ఆవేదన పోస్టర్ వేసిన గ్రామస్తులు
శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నేటి వరకు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సమస్యలను పరిష్కరించ లేదని ప్రజల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా గుంజేపల్లి గ్రామ ప్రజలు ఎమ్మెల్యే పద్మావతి కనిపించడంలేదని పోస్టర్లు వేసి తమ నిరసన తెలియజేశారు. ఎమ్మెల్యే పద్మావతి ఫోటో వేసి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అంటూ పేర్కొని ఆమె కనిపించటం లేదన్నారు. తమ ఆవేదనను వెళ్లగక్కారు.

ఎన్నికల్లో గెలిచాక ప్రజలకు అందుబాటులో లేరని ఆగ్రహం
ఎలక్షన్ టైం లో ఓట్లు అడగడానికి వచ్చిన పద్మావతి గారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఓటు వేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని పోస్టర్ లో ముద్రించారు. ఇదే సమయంలో ప్రజా సమస్యలను పక్కకునెట్టి ఎక్కడున్నారో తెలియడం లేదు అంటూ పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆచూకి తెలుపగలరు ఇట్లు గుంజేపల్లి గ్రామ ప్రజలు శింగనమల నియోజకవర్గం అని ఆ పోస్టర్ లో పేర్కొన్నారు.

మౌలిక సదుపాయాల కోసం గుంజేపల్లి గ్రామ ప్రజల వినూత్న నిరసన
శింగనమల నియోజకవర్గంలోని గుంజేపల్లి గ్రామంలో మౌలిక సదుపాయాలు కూడా లేక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గుంజేపల్లి గ్రామంలో తాగునీరు ప్రధాన సమస్యగా ఉంది. అయినప్పటికీ ప్రజల సమస్యలను ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని, ఎమ్మెల్యేగా గెలిచినప్పటినుండి ఇప్పటివరకు గుంజేపల్లి గ్రామానికి చేసిందేమీ లేదని పోస్టు ద్వారా ఎమ్మెల్యే పనితీరు పై ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేశారు గుంజే పల్లి గ్రామస్తులు.

గతంలోనూ ఉండవల్లి శ్రీదేవి తప్పిపోయారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
గతంలోనూ అనేక మంది ఎమ్మెల్యేలపై ప్రజలు ఇదే తరహాలో తమ నిరసన వ్యక్తం చేశారు.గతంలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనిపించటం లేదని, ఆమె తప్పిపోయారు అంటూ తుళ్లూరు మహిళా రైతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజధాని అమరావతి కోసం సాగుతున్న ఉద్యమం లో భాగంగా మహిళా రైతులు పిల్లలతో రోడ్డుపై బైఠాయించి నిరసన చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పట్టించుకోలేదని, అందుకే ఆమె తప్పిపోయింది అంటూ ఏకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు రైతులు. ఇప్పుడు మళ్ళీ మరో మహిళా ఎమ్మెల్యే కనిపించటం లేదని పోస్టర్లు వేశారు. ఇప్పటికైనా సదరు ఎమ్మెల్యే స్పందిస్తారా? తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications