కరోనా వచ్చినా పర్లేదు అనుకుంటే రావొచ్చు.. గుంజేపల్లివాసుల పోస్టర్ పై ఎమ్మెల్యే పద్మావతి సెటైర్లు
తమ ప్రాంత ఎమ్మెల్యే కనబడడం లేదని గుంజేపల్లి వాసులు శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిపై పోస్టర్లు వేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక దీనిపై శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి స్పందించారు. బుధవారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఆమె వివరణ ఇచ్చారు.

రెండు రోజులు కనిపించకుంటే తనను మిస్ అవుతున్న ప్రజలు .. ఎమ్మెల్యే సెటైర్లు
శింగనమల నియోజకవర్గంలోని గుంజేపల్లి ప్రజలు తాను రెండు రోజులు కనిపించకపోతే తనను తెగ మిస్ అవుతున్నారు అంటూ ఆమె చలోక్తి విసిరారు. తాను కనిపించడం లేదంటూ ఒక పోస్టర్ ను వైరల్ చేస్తున్న వారి వెనుక ఎవరున్నారో తనకు తెలియడం లేదని, అసలు వారి ఉద్దేశ్యం ఏమిటో కూడా అంతుచిక్కడం లేదని జొన్నలగడ్డ పద్మావతి వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను ప్రజాక్షేత్రంలో ఉంటున్నానని పేర్కొన్న ఎమ్మెల్యే పద్మావతి ఎమ్మెల్యేగా తను రూల్ బుక్ ప్రకారమే వెళుతున్నట్లుగా వెల్లడించారు.

కరోనా వచ్చినా పర్లేదు అనుకుంటే కలవటానికి రండి
ఈనెల 16వ తేదీన తన భర్త సాంబశివారెడ్డికి కరోనా సోకిందని, ఈక్రమంలో తామంతా ఇంటి నుండి బయటకు వెళ్లకుండా క్వారంటైన్ లో ఉన్నామని ఎమ్మెల్యే పద్మావతి వివరణ ఇచ్చారు. అంతేకాదు గుంజేపల్లి ప్రజలు తనను మిస్ అవుతున్నాము అని బాధపడేవారు కరోనా వచ్చినా పర్వాలేదు అనుకుంటే తనను కలవడానికి ఇంటికి రావద్దని గుంజేపల్లి గ్రామ ప్రజలకు ఎమ్మెల్యే పద్మావతి పిలుపునిచ్చారు. ఎవరి కులం వారికి గొప్ప అని, గుంజా పల్లి లో కొందరు కులాన్ని పట్టుకొని వేలాడుతున్నారు అంటూ ఎమ్మెల్యే పద్మావతి అసహనం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే కనిపించటం లేదని పోస్టర్ వేసిన ప్రజలు.. బదులిచ్చిన ఎమ్మెల్యే
ఇక అసలు విషయానికి వస్తే తాజాగా గుంజేపల్లి గ్రామ ప్రజలుఎమ్మెల్యే పద్మావతి కనిపించడంలేదని పోస్టర్లు వేసి తమ నిరసన తెలియజేశారు. ఎమ్మెల్యే పద్మావతి ఫోటో వేసి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి శింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అంటూ పేర్కొని ఆమె కనిపించటం లేదన్నారు. ఎలక్షన్ టైమ్ లో ఓట్లు అడగడానికి వచ్చిన పద్మావతి గారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఓటు వేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని పోస్టర్ లో పేర్కొన్నారు.ఇదే సమయంలో ప్రజా సమస్యలను పక్కకునెట్టి ఎక్కడున్నారో తెలియడం లేదు అంటూ పేర్కొన్నారు. ఎమ్మెల్యేఆచూకి తెలుపగలరుఇట్లు గుంజేపల్లిగ్రామ ప్రజలు శింగనమల నియోజకవర్గంఅని ఆ పోస్టర్ లో పేర్కొన్నారు. దీనిపై ఎమ్మెల్యే పద్మావతి కాస్త గట్టిగానే సమాధానమిచ్చారు. గుంజేపల్లి ప్రజలపై సెటైర్లు వేశారు.