ఏపీలో పతాకస్థాయికి సోషల్ మీడియా వార్.. కేసులను లెక్క చేయని వైనం..!
కుల రాజకీయాల ప్రభావం అధికంగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాజకీయ రణ రంగంలో 2014 ఎన్నికల నుంచి స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు తమకు మద్దతుగా కుల నేతలను పోగేయడం, మద్దతుదారులను మచ్చిక చేసుకోవడం, ఎన్నికల అక్రమాల వరకూ వెళ్లి అధికారం చేజిక్కించుకున్న పార్టీలు... ఆ తర్వాత రూటు మార్చాయి. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ప్రత్యర్ధులకు చిక్కకుండా వారిపై బురద జల్లడమే ఇప్పడు లేటెస్ట్ ఫ్యాషన్..
కుల వృత్తుల వారి అరిగోస ... లాక్ డౌన్ తో కుండలు కొనే వాళ్ళు లేక ..కుమ్మరుల జీవనమెలా ?
2019 ఎన్నికలు తెచ్చిన మార్పు...
2014 ఎన్నికల్లో స్వల్ప తేడాతో అదికారం కోల్పోయిన వైసీపీ ఆ తర్వాత వ్యూహాలు మార్చుకుంది. ముఖ్యంగా ఏపీలో కులాల ఆధిపత్యం, ప్రత్యర్ధులకు అండగా ఉన్న మీడియా సంస్ధలను ఎదుర్కొని విజయం సాధించడం అంత సులువు కాదని గుర్తించిన వైసీపీ.. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టింది. అందులో నుంచి పుట్టుకొచ్చిందే ప్రశాంత్ కిషోర్ మంత్రం. అప్పటికే వివిధ రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్న ప్రశాంత్ కిషోర్ ను భారీ మొత్తం చెల్లించి మరీ రంగంలోకి దింపారు. స్వతహాగా ఐటీని వాడుకోవడంలో దిట్ట అయిన ప్రశాంత్ కిషోర్ రాగానే పని ప్రారంభించేశాడు. గెలవాలంటే మన బలమే సరిపోదు ప్రత్యర్ధుల బలహీనత మీద కూడా దెబ్బ కొట్టాలన్న వ్యూహాన్ని అమలు చేశాడు. 2019 ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న టీడీపీ చేస్తన్న ప్రతీ తప్పిదాన్ని గుర్తించడం, దాన్ని సోషల్ మీడియాలో ఏకి పారేయడం లక్ష్యంగా ప్రశాంత్ వ్యూహాలు సాగాయి.
వైసీపీ అఖండ విజయంతో...
ప్రశాంత్ కిషోర్ అమలు చేసిన ఈ వ్యూహం వైసీపీని భారీ మెజారిటీతో అధికారంలో కూర్చోబెట్టగా.. టీడీపీని ఎన్నడూ లేనంత కనిష్ట స్ధాయికి దిగజార్చింది. ఎన్నికలకు ముందు ప్రశాంత్ ను బీహారీ గజదొంగగా అభివర్ణించిన చంద్రబాబు ఆ తర్వాత ఆయన చేసిన మ్యాజిక్ చూసి నివ్వెరపోవాల్సిన పరిస్ధితి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన చంద్రబాబు.. ప్రశాంత్ కు బదులు ఆయన శిష్యుడు రాబిన్ శర్మను తెచ్చుకున్నారు. ఆ తర్వాత వైసీపీ పాలనపై తిరిగి అదే వ్యూహం అమల్లోకి వచ్చింది. జగన్ తప్పు చేస్తే చాలు సోషల్ మీడియాలో ఏకేయాల్సిందే అన్నంతగా టీడీపీ సోషల్ టీమ్ చెలరేగిపోయింది. ఈ వ్యూహం అమలు కేవలం పార్టీ నేతలు తీసుకోలేదు. కులం పరంగా అండగా ఉంటున్న ఎంతో మంది దీన్నో స్వకార్యంగా స్వీకరించారు. తాజాగా సీఐడీ పోలీసులు నమోదు చేస్తున్న కేసులు చూస్తే ఇది అర్ధమవుతుంది.
టీడీపీ వ్యూహంతో వైసీపీ బెంబేలు...
తాము ఏ రూట్ లో వచ్చి విజయం సాధించామో సరిగ్గా అదే రూట్ ను టీడీపీ ఎంచుకోవడంతో వైసీపీకి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇసుక కొరత నుంచి తీసుకుని తాజాగా డాక్టర్ సుధాకర్ అంశం వరకూ ప్రతీ సారీ సీఎం జగన్ ను, ఆయన ప్రభుత్వాన్ని ఏకి పారేస్తూ టీడీపీ సాగిస్తున్న సోషల్ మీడియా వార్ తాజాగా పతాక స్ధాయికి చేరుకుంది. ఏకంగా 66 ఏళ్ల రంగనాయకి అనే వృద్ధురాలు సైతం సోషల్ మీడియాలో వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతుందంటే పరిస్ధితి ఏ స్ధాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సాధారణ గృహిణి ఉండవల్లి అనూష వ్యవహారం కూడా ఇలాంటిదే. హైదరాబాద్ లో ఉన్న మల్లాది రఘునాథ్ వీరందరికీ కావాల్సిన మేతను అందిస్తున్నారు. వాస్తవానికి వీరంతా టీడీపీ సభ్యులు కాదు, కార్యకర్తలు, అభిమానులు కాదు. కేవలం కులాభిమానులే.
హైకోర్టుకూ పాకిన జాడ్యం...
తామ అధికారంలోకి రావడానికి కీలకమైన సోషల్ మీడియాను వైసీపీ ఆ తర్వాత అంతగా పట్టించుకోలేదు. కానీ టీడీపీ తమ రూట్ లోనే వచ్చి దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తుందని తెలియగానే వైసీపీ అప్రమత్తమైంది. మళ్లీ టీడీపీపై సోషల్ మీడియా వార్ మొదలుపెట్టింది. అయితే ఈసారి మరింత బలంగా టీడీపీతో పాటు ఆ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న అందరినీ టార్గెట్ చేస్తూ పోతోంది. అదే క్రమంలో హైకోర్టు నుంచి వరుసగా తమకు వ్యతిరేక తీర్పులు రావడంతో ఏకంగా న్యాయమూర్తులను సైతం టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వరకూ వెళ్లింది. ఈసారి వైసీపీ నేతలతో పాటు ఆ పార్టీకి మద్దతుగా ఉన్న కుల నేతలు కూడా రంగంలోకి దిగినట్లు తాజాగా సీఐడీ నమోదు చేస్తున్న కేసులను బట్టి అర్ధమవుతోంది. ఏకంగా న్యాయమూర్తులపైనే విమర్శలు మొదలుకావడంతో అప్రమత్తమైన హైకోర్టు.. సుమోటోగా 49 మందిపై కోర్టు ధిక్కరణ కేసుల నమోదుకు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో ఇప్పటికే ఏడుగురిపై సీఐడీ కేసులు పెట్టింది.
Recommended Video
ఏ స్ధాయికి వెళుతుందో....
ఏపీలో కులాలతో మొదలై పార్టీల వరకూ పాకిన సోషల్ మీడియా యుద్ధం ఇప్పుడు హైకోర్టును తాకినా ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. సైబర్ చట్టాలు ఉల్లంఘిస్తే మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకూ శిక్షలు ఉన్నప్పటికీ పార్టీలు, వారి మద్దతుదారులు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండానే ముందుకెళ్తున్నారు. సీఐడీ వరుసగా కేసులు నమోదు చేస్తున్నా ఇంకా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. దీనికి కారణం సైబర్ చట్టాలు బలహీనంగా ఉండటం, ఈ అకౌంట్లను ఆపరేట్ చేస్తున్న వారంతా అజ్ఞాతంలోనే ఉండటం, ఈ సోషల్ మీడియా సంస్ధల సర్వర్లన్నీ అమెరికాతో పాటు విదేశాల్లో ఉండటం వంటి అంశాలే. దీంతో హైకోర్టు కేసులు కానీ ఇతరత్రా హెచ్చరికలు కానీ వీరిపై పని చేస్తాయని భావించలేని పరిస్ధితి. వీటికి బదులుగా ప్రభుత్వమే కఠిన చట్టాలను తీసుకొచ్చి వీటిని అడ్డుకోవాల్సిందే.