విశాఖ, తిరుపతి, చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే బిగ్ అలర్ట్..!
తెలుగు రాష్ట్రాల్లో పండుగల రద్దీ, కొత్త సంవత్సరం సందర్భంగా ప్రయాణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే వరుసగా ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోంది. అవి కూడా సరిపోకపోవడంతో ఇప్పటికే ప్రకటించిన పలు ప్రత్యేక రైళ్లను మరికొంతకాలం పొడిగిస్తోంది. తద్వారా ప్రయాణికుల రద్దీని క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే క్రమంలో ఇవాళ రెండు రాష్ట్రాల్లోని మూడు కీలక స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే ప్రత్యేక రైళ్లపై మరో కీలక ప్రకటన చేసింది.
ఏపీలోని విశాఖ పట్నం, తిరుపతితో పాటు తెలంగాణలోని చర్లపల్లి స్టేషన్ మధ్య రాకపోకలు సాగిస్తున్న పలు ప్రత్యేక రైళ్లను మరికొంతకాలం పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఇవాళ ప్రకటించింది. ఇందులో ప్రతీ సోమవారం విశాఖ నుంచి తిరుపతికి నడుపుతున్న ప్రత్యేక రైలు నంబర్ 08583 ఈ నెల 29 వరకూ మాత్రమే అందుబాటులో ఉండగా.. దీన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ వరకూ పొడిగించారు. అలాగే తిరుపతి నుంచి విశాఖకు ప్రతీ మంగళవారం నడుపుతున్న ప్రత్యేక రైలు నంబర్ 08534 ఈనెల 30వ తేదీ మాత్రమే అందుబాటులో ఉండగా.. దీన్ని ఫిబ్రవరి 24 వరకూ పొడిగించారు.

అలాగే విశాఖపట్నం నుంచి తిరుపతికి ప్రతీ బుధవారం నడుపుతున్న ప్రత్యేక రైలు నంబర్ 08547 ఈనెల 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండగా.. దీన్ని ఫిబ్రవరి 25 వరకూ పొడిగించారు. తిరుపతి నుంచి విశాఖకు ప్రతీ గురువారం నడుపుతున్న ప్రత్యేక రైలు నంబర్ 08548 జనవరి 1 వరకూ అందుబాటులో ఉండగా..దీన్ని ఫిబ్రవరి 26 వరకూ పొడిగించారు. అలాగే విశాఖ నుంచి చర్లపల్లికి ప్రతీ శుక్రవారం నడుపుతున్న ప్రత్యేక రైలు నంబర్ 08579 ఈ నెల 26 వరకూ మాత్రమే అందుబాటులో ఉండగా.. దీన్ని ఫిబ్రవరి 27 వరకూ పొడిగించారు. దీంతో పాటు చర్లపల్లి నుంచి విశాఖకు ప్రతీ శనివారం నడుపుతున్న ప్రత్యేక రైలు నంబర్ 08580 ఈ నెల 27వ తేదీ వరకూ మాత్రమే అందుబాటులో ఉండగా.. దీన్ని ఫిబ్రవరి 28వ తేదీ వరకూ పొడిగించారు.












Click it and Unblock the Notifications