ఫోన్ చేసి అడిగి... జనసేనలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం
అమరావతి: ఇటీవల జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, ఆకుల సత్యనారాయణల రాజీనామాలను నవ్యాంధ్ర ప్రదేశ్ సభాపతి కోడెల శివప్రసాద రావు మంగళవారం ఆమోదించారు. రావెల 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత మంత్రి అయ్యారు. గత కేబినెట్ విస్తరణలో ఆయన మంత్రి పదవి కోల్పోయారు.
ఇటీవల జనసేన 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడం, పవన్ కళ్యాణ్ రాజకీయంగా కీలకంగా మారిన నేపథ్యంలో రావెల కిషోర్ బాబు టీడీపీకి, ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం జనసేనలో చేరారు.
అలాగే, భారతీయ జనతా పార్టీ నుంచి ఆకుల సత్యనారాయణ గత ఎన్నికల్లో గెలిచారు. ఆయన కూడా ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, పవన్ కళ్యాణ్ సమక్షంలో టీడీపీలో చేరారు.
వారు రాజీనామా చేసినందువల్ల స్పీకర్ వారితో ఫోన్లో మాట్లాడారు. రాజీనామాకు గల కారణాలను ఆరా తీశారు. వారు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశామని చెప్పారని తెలుస్తోంది. దీంతో వారి రాజీనామాలను ఆమోదించారు. బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాల రావు, టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డిలు కూడా రాజీనామా చేశారు. కానీ వారివి స్పీకర్ కార్యాలయానికి చేరుకోలేదని తెలుస్తోంది.
కాగా, ఈ రాజీనామాలతో వారు టీడీపీని ఓ విధంగా ఇరకాటంలో పడేసినట్లే. వారు పార్టీ మారి తమ పదవులకు రాజీనామా చేశారు. స్పీకర్ కూడా తర్వాత ఫోన్ చేసి వారి రాజీనామాలు ఆమోదించారు. కానీ 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన 23 మంది టీడీపీలో చేరారు. కానీ వారు రాజీనామా చేయలేదు. దీనిపై వైసీపీ నిత్యం టీడీపీపై విమర్శలు గుప్పిస్తోంది.