ఆకాశమంత పందిరిలో రాములోరి కళ్యాణం.. ఏపీ వ్యాప్తంగా సంబరాలిలా!
శ్రీరామనవమి వేడుకలను తెలుగు రాష్ట్రాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో రాములోరి కళ్యాణం ఘనంగా జరుగుతుంది. తిరుమలలో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు టీటీడీ అధికారులు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఉదయం 9 నుండి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.
తిరుమలలో సీతారామ స్వాములవారికి స్నపన తిరుమంజనం
ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అర్చకులు రంగనాయక మండపంలో, వేదమంత్రోచ్ఛరణల నడుమ అభిషేకం చేశారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ జరగనుంది. ఆ తరువాత రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా టిటిడి అధికారులు నిర్వహించనున్నారు.

తిరుపతిలోని కోదండరామాలయంలో భక్తుల రద్దీ
అంతేకాదు తిరుపతిలోని కోదండరామాలయం రామనామస్మరణలతో మారుమ్రోగుతోంది. శ్రీరామ నవమి సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తుల కోసం టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు మంచినీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. వివిధ రకాల పుష్పాలు, విద్యుత్ దీపాలంకరణలతో ఆలయాన్ని ముస్తాబు చేశారు. శ్రీరామనవమి పర్వదినం కావడంతో ఆలయంలో మూలవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. మధ్యాహ్నం ఆస్థానాన్ని నిర్వహించారు. ఈరోజు రాత్రి హనుమంతవాహసేవను నిర్వహించనున్నారు.
చౌటపాళెం లో నవమి వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఏపీలోని నెల్లూరు జిల్లాలోని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్వగ్రామమైన చౌటపాళెం లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక రామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో సీతారామ కళ్యాణ ఘట్టాన్ని తిలకించారు.
రామతీర్ధంలో రాములవారి కల్యాణం
ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్రప్రభుత్వం తరఫున విస్తృతమైన ఏర్పాట్లు చేసి స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. సీతారాముల కల్యాణాన్ని చూడడానికి భారీగా భక్తులు వచ్చారు. రామతీర్థం సీతారామస్వామి ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు రాములవారిని దర్శించుకున్నారు. సీతారాముల కల్యాణానికి రాష్ట్రప్రభుత్వం తరఫున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎంపీ కలిసి పట్టు వస్త్రాలను సమర్పించారు.
కడప ఒంటిమిట్ట ఆలయంలో నవమి వేడుకలు
ఇదిలా ఉంటే కడప ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలోనూ సీతారామ స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రామాలయంలో రాముల వారి కళ్యాణ వేడుకలకు టిటిడి అన్ని ఏర్పాట్లను చేసింది. అంగరంగ వైభవంగా ఇక్కడ స్వామివారి కల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రాములవారిని దర్శించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications